రూల్స్ పొరుగు పార్టీల‌కే కాదు.. మ‌న‌కూ ఇంతే

స‌హ‌జంగానే రాజ‌కీయాల్లో ఒక టాక్ ఉంటుంది. పొరుగు పార్టీల‌కు నీతులు చెప్పేందుకు నాయ‌కులు ఎప్పుడూ.. సిద్ధంగానే ఉంటారు. మీరుఅది చేయొద్దు.. మీరు ఇది చేయొద్దు..! అని అధికారంలో ఉన్న పార్టీలు చెబుతుంటాయి. అంతేకాదు.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించవ‌ద్ద‌ని చెప్పిన నాయ‌కులు కూడా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా దీనికి అతీతం ఏమీకాదు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఎప్ప‌టిక‌ప్పుడు సుద్దులు చెబుతూనే ఉంది. అయితే.. త‌న‌దాకా.. వ‌చ్చే స‌రికిమాత్రం.. వితండ వాదం చేస్తుంది.

కానీ, తాజాగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు.. వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పొరుగు పార్టీల‌కే కాదు.. మ‌న‌కూ ఇంతే! అని.. వైసీపీలోని త‌ట‌స్థ నేత‌లు.. వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంపై ఉక్కుపాదం మోపిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను.. చాలా ప్రాంతాల్లో తీసేసింది. దీనికి అనేక కార‌ణాలు చెప్పింది. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిగా ఉంద‌ని.. బ‌హిరంగ ప్రాంతంలో ఉన్నాయ‌ని పేర్కొని స‌మ‌ర్థించుకుంది.

అయితే.. త‌న దాకా వ‌స్తే.. మాత్రం.. అదే ప‌ని త‌ప్పుకాద‌ని చెప్పింది. అయితే.. దీనికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మయూరి కూడలిలో మాజీ ముఖ్యమంత్రి, సీఎం జ‌గ‌న్ తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాల‌ని పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించారు. ఆ వెంట‌నే.. ప్ర‌భుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది. ఆ వెంట‌నే విగ్ర‌హ ఏర్పాటుకు భూమి పూజ కూడా అయిపోయింది.

ఇక‌, నిర్మాణ‌మే త‌రువాయి.. అన్న ద‌శ‌లో.. కొంద‌రు హైకోర్టును ఆశ్ర‌యించారు. వైఎస్ విగ్ర‌హం పెట్టాల‌ని అనుకున్న ప్రాంతం.. బ‌హిరంగ ప్ర‌దేశ‌మ‌ని.. ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం దీనిని బస్ స్టాండ్‌గా వాడుతున్నార‌ని.. తెలిపారు. ఈ క్ర‌మంలో విగ్ర‌హ ఏర్పాటును అడ్డుకోవాలని కోరుతూ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. బహిరంగ ప్రదేశాలు, రహదారుల్లో విగ్రహాలు నెలకొల్పడం సుప్రీంకోర్టు తీర్పునకు, అదేవిధంగా 2013 ఫిబ్రవరి 18న ఉమ్మ‌డి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 18కి విరుద్ధమని పేర్కొంది.

వైఎస్‌ విగ్రహం ఏర్పాటులోనూ ఈ రెండు ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌కు కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ప‌రిణామంపై.. వైసీపీలోని త‌ట‌స్థ‌ నాయ‌కులు.. ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. రూల్స్ అన్న‌ప్పుడు.. అంద‌రికీ ఒకే విధంగా ఉంటాయ‌ని.. అంటున్నారు. మ‌రి అధిష్టానం దీనిని ఎలా చూస్తుందో చూడాలి.