కాంగ్రెస్ చేస్తున్న అదే త‌ప్పు.. మునుగోడులో కూడా!

ప‌దే ప‌దే త‌ప్పులు చేయ‌డం.. కాంగ్రెస్‌కు అల‌వాటుగా మారింద‌నే వాద‌న ఎప్ప‌టి నుంచో ఉంది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. ఇదే త‌ర‌హాలో కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌లితంగా.. పార్టీకి అపార‌మైన న‌ష్టం వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మయంలో.. అభ్య‌ర్థిని నిర్ణ‌యించేందుకు చాలా స‌మ‌యం తీసుకున్నారు. అప్ప‌టికే ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు ప్ర‌చారం కూడా ప్రారంభించేశారు. దీంతో కాంగ్రెస్ అభ్య‌ర్థిలోనూ.. కార్య‌క‌ర్త‌ల్లోనూ.. నీరసం వ‌చ్చేసింది.

ఇక‌, ఇప్పుడు అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ మునుగోడు ఉప ఎన్నిక విష‌యంలోనూ.. అభ్యర్థిపై కాంగ్రెస్ ఎటూ తేల్చలేకపోతోంది. నెలాఖరుకు ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహుల్లో ఎవరికి టికెట్దు దక్కుతుందో తెలియక.. వారు కూడా క్షేత్ర స్థాయిలో ఆశించిన మేరకు పని చేయడం లేదు. పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. దీంతో వారు.. ప్ర‌చారం చేయాలా.. వ‌ద్దా.. చేస్తే.. ఏ అభ్య‌ర్థి త‌ర‌ఫున చేయాలి? అనే చ‌ర్చలో మునిగిపోయారు.

మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిన తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీ అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తనకు గతంలో ఉన్న పరిచయా లతో మండల, గ్రామ స్థాయి నాయకులను పిలిపించుకుని మాట్లాడుతూ మద్దతు కూడగడుతున్నారు. ఈ ప‌రిణామాలు.. రాజ‌గోపాల్‌కు ప్ల‌స్ అవుతున్నాయి. మ‌రోవైపు.. టీఆర్ ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

అంతేకాదు.. సామాజిక వ‌ర్గాల వారీగా.. కూడా ఓట్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా హుజూరాబాద్లో మాదిరి.. చివరి వరకు కాకుండా వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించి క్షేత్రస్థాయిలో శ్రేణుల్లో భరోసా కల్పించాలని పార్టీ సీనియ‌ర్లు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రియాంక గాంధీ వద్ద జరిగిన సమావేశంలో కూడా అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది. ఆ తరువాత రాష్ట్రానికి వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ అభ్యర్థి ఎంపికపై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లతో సమావేశమయ్యారు.

మరుసటి రోజు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత దామోదర్రెడ్డిలు నలుగురు ఆశావహులతో సమావేశమయ్యారు. టికెట్ కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని.. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరు కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని స్పష్టం చేశారు. అయితే.. ఇది ఎప్పుడు? ప్ర‌క‌టిస్తారు? అనేది మాత్రం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికైనా.. పార్టీ నిర్ణ‌యం తీసుకోవాల‌నేది క్షేత్ర‌స్థాయి నాయ‌కుల మాట‌.