అన్న క్యాంటీన్ల సెంటిమెంట్‌.. ఏం జరుగుతుందో?

రాష్ట్రంలో పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నాన్ని అతిత‌క్కువ ధ‌ర‌కే అందించే అన్న క్యాంటీన్ల సెంటిమెంటు అధికార పార్టీలోనూ క‌నిపిస్తోంది. దీంతో వైసీపీ నేత‌లు కూడా అన్న క్యాంటీన్ల బాట ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు సుమారు ఏడాది ముందు.. అప్ప‌టి సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించారు. రూ.5 కే ఉద‌యం టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం అందించేలా.. అక్ష‌య పాత్ర సంస్థ‌తో ఒప్పందం చేసుకుని.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించారు. ఈ కార్య‌క్ర‌మం హిట్ట‌యింది. పేద‌ల‌కు, కార్మికులు.. చేతి వృత్తుల వారు.. హాక‌ర్ల‌కు.. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా.. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆహార ప‌దార్థాలు అందాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ బృందం మొత్తం కూడా.. అన్నా క్యాంటీన్ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని ప్ర‌చారం చేసింది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అన్నా క్యాంటీన్ల‌ను ఎత్తేసింది. త‌ర్వాత తెరుస్తాం.. అంటూనే.. వీటిని వ‌చ్చిన నాలుగు మాసాల్లోనే మూసేసింది. అప్ప‌టికి అక్షయ పాత్ర సంస్త‌తో చేసుకున్న ఒప్పందం కూడా ముగిసిపోవ‌డంతో వారు కూడా వెళ్లిపోయారు. ఇక‌, అన్న‌క్యాంటీన్ల కోసం.. న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో క‌ట్టించిన బ‌వ‌నాల‌ను.. ప్ర‌స్తుతం స‌చివాల‌యాలుగా వినియోగిస్తున్నారు.

మ‌రికొన్ని చోట్ల ఇప్ప‌టికీ.. ఇవి నిరుప‌యోగంగానే ఉన్నాయి. అయితే.. అన్నా క్యాంటీన్ల సెంటిమెంటును మాత్రం టీడీపీ వ‌దిలి పెట్ట‌లేదు. ఇప్ప‌టికీ.. దానిని లైవ్‌లోనే ఉంచింది. పేద‌లు,, కార్మికులు.. ఇప్ప‌టికీ ఈ క్యాంటీన్ల‌ను గుర్తుకు తెచ్చుకునేలా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. కుదిరిన చోట ఇటీవ‌ల‌.. మ‌హానాడు అనంత‌రం.. ఇలాంటి క్యాంటీన్ల‌ను తెరిచారు. అయితే.. పోలీసులు అడ్డుకోవ‌డంతో తాత్కాలికంగా మూసేశారు. కానీ, ప్ర‌జ‌ల్లో మాత్రం ఈ త‌ర‌హా సెంటిమెంటును మాత్రం ఎవ‌రూ తుడిచేయ‌లేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా అన్నా క్యాంటీన్ల బాట ప‌డుతున్నారు.

ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాదిన్న‌ర స‌మ‌య‌మే ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల సెంటిమెంటును ప‌సిగ‌డుతున్న నాయ‌కులు.. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకున్న అన్న క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు వైసీపీ ఎమ్మెల్యే  వెంక‌ట‌రామిరెడ్డి మునిసిపాలిటీ అధీనంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను లీజుకు తీసుకున్నారు. వైఎస్సార్‌-వైవీఆర్ అన్న క్యాంటీన్ పేరుతో త్వ‌ర‌లోనే దీనిని ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఇక్క‌డ రూ.10 కే అన్నీ అందిస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు.  ఇక‌, మంత్రి రోజా, ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటివారు.. ఇప్ప‌టికే ఈ క్యాంటిన్ల‌ను వివిధ పేర్లతో న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే.