అనూహ్యంగా బండి సంజయ్ అరెస్టు

తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న పరిణామాలు చూస్తే.. రాష్ట్రంలో ఉన్నట్లుండి ప్రశాంత వాతావరణం కాస్త చెదురుతూ.. రాజకీయ ఉద్రిక్తలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయా? అన్న సందేహం కలిగే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు (మంగళవారం) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్త మీద ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినందుకే ఆయన అరెస్టు జరిగినట్లుగా చెబుతున్న సంగతి తెలిసిందే.

డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై నమోదైన కేసు నేపథ్యంలో.. ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకోవటం విస్మయానికి గురి చేసింది. జనగాం పొమ్నూరు వద్ద చేపట్టిన ‘కేసీఆర్ కుటుంబ దమననీతిపై ధర్మదీక్ష’ కార్యక్రమం నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

బండిని అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నాల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు బండి సంజయ్ ను అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో బీజేపీ కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం.. పోలీసులు దాడులు చేశారంటూ ఆరోపిస్తూ బండి సంజయ్ దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. బండిని తరలించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాల్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంగా చేయగా.. వారిని చెదరగొట్టి పోలీసు వాహనంలో బండిని తరలించినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదికలు అందించాయి. దీంతో బీజేపీ నేత తరుణ్ చుగ్ తో సహా కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు సంజయ్ ను ఫోన్లో పరామర్శించారు. దాడి జరుగుతుందన్న సమాచారంపై స్పందించిన పోలీసులు భద్రతనుపెంచే ప్రయత్నం చేయగా.. అందుకు బండి ఒప్పుకోలేదు. తన సెక్యురిటీని తమ కార్యకర్తలు చూసుకుంటారని చెప్పినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో తమ కార్యకర్తలకు ఏదైనా జరిగితే మాత్రం అంతు చూస్తామంటూ బండి వార్నింగ్ ఇచ్చారు.

పాదయాత్ర శిబిరం వద్ద.. కేసీఆర్ కుటుంబం చేస్తున్న దమన నీతికి వ్యతిరేకంగా ధర్మ దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించి.. అందుకు సిద్ధమవుతున్న వేళ.. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తరలించారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ పాత్రను తేల్చేంతవరకు తాము నిరసనలు చేస్తూనే ఉంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందన్న భావన కలిగేలా బీజేపీ – టీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోందన్న మాట వినిపిస్తోంది.