అప్పుల్లో కొట్టుమిట్టాడే టాప్ 5 రాష్ట్రాలు

ఆర్థికంగా దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న శ్రీలంక దేశాన్ని బూచిగా చూపిస్తూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్న ప్రభుత్వాల్ని దెబ్బ తీసేందుకు వీలుగా చేస్తున్న ప్రచారంలో పస లేదన్న విషయం తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న విధానాల కారణంగా పెద్ద ఎత్తున అప్పులు అవుతున్నాయని.. రాష్ట్రం మరో శ్రీలంక మాదిరి మారుతుందంటూ చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న విషయం తాజా నివేదిక స్పష్టం చేసింది.

లాక్ డౌన్ తర్వాత దేశంలో పెద్దవైన 20 రాష్ట్రాల్లోని ఆర్థిక పరిస్థితులపై సుదీర్ఘంగా.. లోతుగా శోధించి సమగ్ర నివేదిక రూపొందించింది. కొవిడ్ నేపథ్యంలో అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా 2020-21 తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల స్థూల ఉత్పత్తిపై ప్రభావం పడటమే కాదు.. అప్పులు.. ద్రవ్యలోటు గణనీయంగా పెరిగిన వైనాన్ని వెల్లడించింది. సెకండ్ వేవ్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు దెబ్బ తిన్నా.. తర్వాత కొన్ని రాష్ట్రాలు పుంజుకున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో ఆదాయాలు పెరిగి.. మూలధన వ్యయం మెరుగుపడినట్లుగా వెల్లడించింది.

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అత్యధిక అప్పుల్లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు లేకపోవటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా చెబుతున్నప్పటికీ.. ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్టు మాత్రం అప్పులున్న టాప్ 5 రాష్ట్రాల్లో మాత్రం ఏపీ.. తెలంగాణ లేకపోవటం గమనార్హం. ఇక.. ఐదు రాష్ట్రాల విషయానికి వస్తే..
1. పంజాబ్
2. హిమాచల్ ప్రదేశ్
3. రాజస్థాన్
4. బిహార్
5. కేరళ
ఈ ఐదు రాష్ట్రాల్లో అప్పులు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2019 నుంచి 2021 ఆగస్టు నెల వరకు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు.. క్యాపిటల్ వ్యయం.. బడ్జెట్ అంచనాలు.. రెవెన్యూ రాబడులను ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2019-20లో ఆర్థిక మందగమనం కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా నిధులు తగ్గినట్లుగా పేర్కొన్నారు. ఏపీతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో 2019తో పోలిస్తే.. 2020, 2021 ఆగస్టుల్లో రెవెన్యూ రాబడులు పెరిగినట్లుగా పేర్కొన్నారు. నివేదికలో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే..

 –  దేశంలో అత్యధికంగా పంజాబ్‌ అప్పుల్లో ఉంది. ఆ రాష్ట్రానికి జీఎస్‌డీపీలో ఏకంగా 49.5 శాతం అప్పులున్నాయి.
 –  రాజస్థాన్‌కు జీఎస్‌డీపీలో 39.5 శాతం మేర అప్పులున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌కు 39.7 శాతం, బిహార్‌కు 38.6 శాతం, కేరళకు 37 శాతం మేర అప్పులున్నాయి.
–   ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్‌డీపీలో 32.5 శాతం మాత్రమే అప్పులున్నాయి.
–  సొంత రాబడుల్లో పంజాబ్‌ వడ్డీ చెల్లింపులపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది.
–  బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ, హర్యానా రాష్ట్రాలు వచ్చే ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పుల వాటా అత్యధికంగా ఉంది.  చత్తీస్‌గడ్‌ వచ్చే ఐదేళ్లలో 59.2 శాతం, ఒడిశా 54.7 శాతం, హర్యానా 48.7 శాతం మేర అప్పులు చెల్లించాల్సి ఉంది.