చంద్రబాబు.. కొత్త రూల్?

వచ్చే ఎన్నికలకు సంబంధించి పోటీచేసే విషయంలో చంద్రబాబు నాయుడు కొత్త రూల్ అమలు చేయబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చెప్పారట. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏమిటయ్యా అంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అట. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఒక కుటుంబంలోని వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తానని స్పష్టంగా చెప్పారు. వీలైనంతమందికి టికెట్ల కేటాయింపులో అవకాశం ఇవ్వటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయ్యుండచ్చు.

అయితే చంద్రబాబు పెట్టిన కొత్తరూలు ఎంతవరకు అమలవుతుంది? ఎంతవరకు పార్టీకి లాభదాయకం అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే పార్టీలోని చాలామంది సీనియర్ నేతల కుటుంబాల్లో కనీసం రెండు టికెట్లను ఆశిస్తున్నవారి సంఖ్య చాలానే ఉంది. ముఖ్యంగా రాయలసీమలో ఇలాంటి సీనియర్ల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. సొంతజిల్లా చిత్తూరులోను, కడపలోను పెద్దగా ఉండకపోవచ్చు కానీ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి.

అనంతపురంలో పరిటాల ఫ్యామిలి, జేసీ బ్రదర్స్ కుటుంబం రెండు టికెట్లను ఆశిస్తున్నాయి. అలాగే కర్నూలులో కేఇ కుటుంబం మూడు టికెట్లను ఆశిస్తున్నది. కోట్ల కుటుంబం రెండు టికెట్లను, భూమా కుటుంబం రెండు టికెట్లపై ఆశలు పెట్టుకున్నది. అలాగే చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించిన డీకే కుటుంబం కూడా చిత్తూరు ఎంఎల్ఏ, రాజంపేట ఎంపీ, తిరుపతి ఎంఎల్ఏ టికెట్లను ఆశిస్తోంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబం కూడా పుంగనూరు, పలమనేరు టికెట్లను ఆశిస్తున్నది.

నిజానికి కోట్ల కుటుంబం మినహా మిగిలిన కుటుంబాలన్ని ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ప్రవేశించి టికెట్లను ఆశించడం లేదు. చాలా సంవత్సరాలుగా పార్టీలోనే పనిచేస్తున్నాయి. పైగా వీళ్ళు కాకుండా మరొకరికి టికెట్ కేటాయిస్తే అంగ, అర్ధబలాల్లో తట్టుకోవటం కూడా కష్టమనేట్లుగా రాజకీయాలు తయారైపోయాయి. ఇక ఉత్తరాంధ్రలో తీసుకుంటే రెండు టికెట్లను ఆశిస్తున్న కింజరాపు, చింతకాయల, బండారు, కిమిడి, పూసపాటి లాంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి. మరి వీళ్ళందరినీ చంద్రబాబు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.