చంద్రబాబు: తెలంగాణలో న్యూ ప్లాన్!

చంద్రబాబు నాయుడు కొత్తగా యాక్టివ్ అవటం ఏమిటనుకుంటున్నారా ? అవును కొత్తగానే యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే యాక్టివ్ అవ్వటం తెలంగాణా రాజకీయాల్లో. తెలంగాణాలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతోంది. షెడ్యూల్ ఎన్నికల సంగతేమో కానీ ముందు మునుగోడు ఉపఎన్నిక దెబ్బకు రాజకీయ వాతావరణం బాగా వేడెక్కిపోయింది. ఈ మధ్యనే విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఒక బహిరంగసభ నిర్వహించాలని, అందులో తాను పాల్గొంటానని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

అప్పుడు చెప్పినట్లుగానే ఖమ్మంలో బహిరంగ సభ ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందనే విషయమై కొందరు నేతలతో చంద్రబాబు మాట్లాడారట. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ లోపల బహిరంగ సభ నిర్వహిస్తే ఎలాగుంటుందనే అంశంపై చర్చ జరిగినట్లు టీడీపీ వర్గాలు చెప్పాయి. రాబోయే ఉపఎన్నికను ఆధారం చేసుకుని చంద్రబాబు మళ్ళీ తెలంగాణాలో యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నారు. తెలంగాణావ్యాప్తంగా సుమారు కోటిమందిదాకా సీమాంధ్రులున్నారు.

వీరిలో అత్యధికులు ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీనంగర్ జిల్లాల్లో కేంద్రీకృమయ్యున్నారు. కాబట్టి సీమాంధ్రుల ఓటర్లే టార్గెట్ గా చంద్రబాబు రాజకీయం ఉండబోతోంది. అంతాబాగానే ఉందికానీ చంద్రబాబును బూచిగా చూపించేందుకు కేసీయార్ రెడీగా కాచుక్కూర్చునున్నారు. గడచిన రెండు ఎన్నికల్లో కూడా చంద్రబాబు తెలంగాణా రాజకీయాల్లో యాక్టివ్ గా తిరిగారు. దాన్ని కేసీయార్ అడ్వాంటేజ్ గా తీసుకుని తెలంగాణా సెంటిమెంటును రెచ్చగొట్టి లాభపడ్డారు.

రేపైనా చంద్రబాబు యాక్టివ్ అయితే కేసీయార్ మళ్ళీ అదేపని చేయకుండా ఉండరు. మరప్పుడు కేసీయార్ రెచ్చగొట్టుడు రాజకీయానికి చంద్రబాబు ఎలాంటి విరుగుడు రాజకీయం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణా ఏర్పడిన ఇంతకాలానికి కూడా ఇంకా సెంటిమెంటు ఉందా ? ఒకవేళ కేసీయార్ సెంటిమెంటు రాజేస్తే జనాలు నమ్ముతారా ? అనేది అయోమయంగా ఉంది. ఏదేమైనా చాలా ప్రశ్నలకు రాబోయే మునుగోడు లేదా షెడ్యూల్ ఎన్నికలు సమాధానం చెబుతాయనే అనిపిస్తోంది.