జగన్ ప్రభుత్వం ఫెయిలైనట్లేనా ?

కుప్పం నియోజకవర్గ ఇన్చార్జి, ఎంఎల్సీ భరత్ చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి స్పందన రెండూ విచిత్రంగానే ఉంది. కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గంలో నీటి సమస్య తీర్చేందుకు హంద్రీ-నీవా ప్రాజెక్టు చాలా కీలకం. ప్రాజెక్టులోని కెనాల్ అంటే కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తిచేస్తే చాలావరకు నీటి సమస్య తీరిపోతుంది. ఇదే విషయమై కార్యకర్తలతో జరిగిన సమావేశంలో భరత్ మాట్లాడుతు ఇరిగేషన్ కాంట్రాక్టర్ సీఎం రమేష్ కావాలనే కెనాల్ పని పూర్తి చేయడం లేదని ఆరోపించారు.

టీడీపీ ఎంపీగా ఉన్నపుడు సీఎం రమేష్ కు చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులు అప్పగించారట. ఇపుడా పనులు పూర్తయితే వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆలోచనతో సీఎం రమేష్ పనులు పూర్తి చేయడం లేదని భరత్ ఆరోపించారు. వెంటనే కాంట్రాక్టర్ ను మార్చి పనులు వేగంగా పూర్తి చేయించాలని ఎంఎల్సీ సూచించారు. ఇందుకు జగన్ స్పందిస్తు వెంటనే కాంట్రాక్టర్ ను మార్చేసి పనులను వేగంగా పూర్తిచేయిస్తానని హామీఇచ్చారు.

ఇంతవరకు బాగానే ఉందికానీ ప్రభుత్వంలోకి వచ్చి మూడేళ్ళయితే ఇంతవరకు భరత్ ఏమి చేస్తున్నట్లు ? భరత్ పుట్టింది పెరిగిందంతా కుప్పంలోనే అయినపుడు నీటి సమస్య పరిష్కారానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుపనులు కావడం లేదని గ్రహించటానికి మూడేళ్ళెందుకు పట్టింది. ఇదే విషయాన్ని గతంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో లేకపోతే జగన్ కో చెప్పుండచ్చుకదా. పెద్దిరెడ్డి ఇరిగేషన్ కాంట్రాక్టరైనపుడు హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు జరగటం లేదని తెలీదా ?

రమేష్ కావాలనే పనులను పూర్తిచేయటం లేదని తెలుసుకునేందుకు భరత్ కు మూడేళ్ళెందుకు పట్టింది ? ఇక జగన్ కోణంలో చూస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ? ఆ పనులు ఎంతవరకు పూర్తయ్యాయనే విషయమై అధికారులు సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వటం లేదా ? కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ఓడించాలని పదే పదే చెబుతున్న జగన్ కు నియోజకవర్గానికి ఎంతో ముఖ్యమైన హంద్రీ-నీవా పనులు జరగటం లేదని తెలీదా ? మంత్రి పెద్దిరెడ్డి, కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ? ప్రజలకోణంలో చూస్తే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల విషయంలో జగన్ ప్రభుత్వం ఫెయిలైనట్లే అనిపించటం లేదా ? అనేలా ఎన్నో సందేహాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.