కోమ‌టిరెడ్డి రాజీనామా.. చివ‌ర‌కు ఏమ‌న్నారంటే!

అనుకున్న‌దే జ‌రిగింది. గ‌డిచిన నెల, రెండు నెల‌లుగా.. తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు దారితీసిన‌.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఉప ఎన్నిక జరిగితేనే నిధులు వస్తాయని అంటున్నారని, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అయితే బీజేపీ వల్లే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

బాధతోటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన స్పీకర్ సమయం తీసుకుని రాజీనామా లేఖను అందజేస్తానని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉందని, పోడు భూముల సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను గౌరవించే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకున్నారని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కేసీఆర్ కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వరని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని, తెలంగాణ శ్రీలంకగా మారే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని, కేసీఆర్ చెప్పుచేతల్లోనే అధికార యంత్రాంగం ఉందని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.

“మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదు. ఒక ఎస్సీ నేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్‌ సహించలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదు. పేదలకు ఇళ్లు లేవు, దళితబంధు లేదు, రోడ్లకు నిధులు ఇవ్వలేదు. నల్గొండ జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అధికార యంత్రాంగమంతా కేసీఆర్‌ అదుపులో ఉంది“ అని కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీకి జై!

అంతేకాదు.. “నా రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రజలు ఇతర పార్టీలను గెలిపించడం తప్పా?“ అని ప్ర‌శ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అన్నారు. త‌న రాజీనామాతో నా ప్రజలకు మేలు కలుగుతుందని భావిస్తున్నాన‌న్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల బాధ కలిగితే క్షమించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడం మోడీ, అమిత్ షాతోనే సాధ్యమ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీకి జై అని వ్యాఖ్యానించారు.