వ‌చ్చే నెలే ముహూర్తం.. జ‌గ‌న్ వ్యూహం ఇదే..!

అనుకున్న‌ది సాధించ‌డ‌మే త‌ప్ప‌.. వెన‌క్కి వెళ్లే మ‌న‌స్త‌త్వం.. రాజ‌కీయాల్లో చాలా మందికి ఉండ‌దు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో అయితే.. ఇది మ‌రింత ఎక్కువ‌. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు అనుకున్న‌ది సాధించారే త‌ప్ప‌.. ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. ఒక‌టి రెండు హామీలు మిన‌హా.. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేసేందుకు వ్యూహాలు వేసుకుని.. అవ‌స‌ర‌మైతే.. అప్పులు చేసైనా కూడా.. ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలోనే తాను అనుకున్న మూడు రాజ‌ధానుల విష‌యంలోనూ.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగు తున్నారు. 2020లోనే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. ఈ విష‌యంలో జ‌గ‌న్ అడుగులు ముందుకు ప‌డ‌డం లేద‌నేది వాస్త‌వం. ఎందుకంటే.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌చ్చాయి. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని రాష్ట్ర హైకోర్టు స్ప‌ష్టం చేయ‌డం.. దీనిపై రైతులు సుదీర్ఘ యుద్ధం చేయ‌డంతో కొంత ఆల‌స్యం అయితే.. అయింది. అయితే.. ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ ముందుకు పోతున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌గ‌న్ వ్యూహం ప్ర‌కారం.. క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని, అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని, విశాఖ‌లో పాల‌న రాజ‌ధాని ఏర్పాటు కావాలి. అయితే.. ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో శాస‌న స‌భ ఉన్నందున ఇక్క‌డ దీనిని కొన‌సాగించ‌నున్నారు. ఇక‌, క‌ర్నూలులో న్యాయ‌రాజధాని ఏర్పాటు కావాలి. దీనికి కేంద్రం స‌హ‌కారం అవ‌స‌రం. తాజాగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కేంద్రానికి జ‌గ‌న్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దీనిపై బీజేపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకునేవీలు క‌నిపిస్తోంది.

ఇది అటు బీజేపీకి కూడా మేలు చేయ‌నుంది. గ‌తంలో క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామ‌ని.. బీజేపీ కూడా ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చింది. ఇప్పుడు అది నెర‌వేర్చ‌డం ద్వారా.. ఇటు జ‌గ‌న్‌కు, అటు బీజేపీకి కూడా లాభ‌మే. మ‌రోవైపు.. ఎటొచ్చీ విశాఖ‌లోపాల‌నా రాజ‌ధానే జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మార‌నుంది. అయితే.. దీనికి కూడా జ‌గ‌న్ మైండ్ బ్లాంక్ అయ్యే వ్యూహం సిద్ధం చేసుకున్నారు.

తాను(సీఎం) ఎక్క‌డ ఉంటే అదే రాజ‌ధాని క‌నుక‌.. తాను వ‌చ్చే శ్రావ‌ణ మాసం(ఆగ‌స్టు)లో విశాఖ‌కు వెళ్లిపోయి.. అక్క‌డ నుంచి పాల‌న చేస్తే.. అదే రాజ‌ధాని అయిపోతుందని అనుకుంటున్నారు. త‌ర్వాత‌.. ఈ కోర్టు చిక్కులు నెమ్మ‌దిగా తొల‌గించుకుని.. మూడు రాజ‌ధానుల‌ను సాకారం చేసుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.