ఉచిత ప‌థ‌కాల‌పై ఆధార‌ప‌డితే షార్ట్ స‌ర్కూట్ త‌ప్పదు: మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల కాలంలో చాలా న‌ర్మగ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. విష‌యం ఏదైనా.. ఆయ‌న చాలా ఆచితూచి వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాల‌కు.. చుర‌క‌లు అంటించాల‌న్నా.. విప‌క్షాల‌పై దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌న్నా.. ఆయ‌న టూవే లైన్‌లో వ‌స్తున్నారు. ఇప్పుడు ఇలానే.. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సంక్షేమ ప‌థ‌కాలు.. ఉచిత ప‌థ‌కాల పేరుతో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అప్పులు చేసి మ‌రీ డ‌బ్బులు పంచుతున్న విష‌యం తెలిసిందే దీనికి న‌వ‌ర‌త్నాలు అని పేరు కూడా పెట్టింది.

అయితే.. తాజాగా మోడీ ఈ సంక్షేమ ప‌థ‌కాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇలా ఉచిత ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం.. అంటే.. షార్ట్కట్ రాజకీయాలని, … దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని అన్నారు. వాటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ ఖాయమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్య‌ల త‌ర్వాత‌.. ఆయ‌న ఎవ‌రిని ఉద్దేశించి ఇలా అన్నారో అనే చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఆయ‌న ఏపీలో ప‌ర్య‌టించ‌డం.. త‌ర్వాత‌.. ఇప్పుడు ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని బ‌ట్టి.. ప‌రోక్షంగా ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్ స‌ర్కారునే టార్గెట్ చేశారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఓట్ల కోసం అమలు చేసే ప్రజాకర్షక పథకాలు దేశాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఓట్ల కోసం అలాంటి పథకాలు ప్రకటించడాన్ని షార్ట్కట్ రాజకీయాలుగా అభివర్ణించారు. వీటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ తప్పదని స్పష్టం చేశారు. ఝార్ఖండ్లోని దేవ్గఢ్లో రూ.16,800 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

షార్ట్కట్ రాజకీయాలనే పెను సవాలును దేశం ఎదుర్కొంటోంది. షార్ట్కట్ రాజకీయాలపై ఆధారపడే దేశానికి షార్ట్ సర్క్యూట్ తప్పదన్నది సత్యం. షార్ట్కట్ రాజకీయంతో దేశమే ధ్వంసం అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. మనమంతా కఠోర శ్రమతో నవభారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రజాకర్షక పథకాలతో ఓట్లు సంపాదించడం సులువే. కానీ.. అలాంటి షార్ట్కట్లు అవలంబిస్తే దీర్ఘకాలిక దుష్పరిణామాలు ఉంటాయి అని మోడీ హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనుసంధానతను పెంచడం సహా ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయని ప్రధాని అన్నారు. ఇవన్నీ దీర్ఘకాలంలో తూర్పు భారతానికి మేలు చేస్తాయని వివరించారు. గత 8ఏళ్లలో కేంద్రం ఈ ప్రాంతంలో రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు.

“రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అనే ఆలోచనతో దేశం గత 8ఏళ్లుగా పని చేస్తోంది. మేం సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి, ఉపాధి కోసం కొత్త దారులను వెతుకుతున్నాం. అభివృద్ధి ఆకాంక్షలకు మేం ప్రోత్సాహం ఇచ్చాం. కష్టతరం అనుకున్న రంగాలపై మా ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోంది.” అని చెప్పారు. అయితే.. మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఉద్దేశించే అయి ఉంటాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.