చంద్రబాబును అసెంబ్లీ ఏమి చేయబోతోంది ?

డేటా చోరీలో చంద్రబాబునాయుడే కీలక సూత్రదారిగా సభాసంఘం తేల్చేసింది. చంద్రబాబు, అప్పటి ఐటి శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ ఆదేశాల ప్రకారమే కిందస్ధాయి ఉద్యోగులు, కొందరు బయటవ్యక్తులు గోప్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినేట్లు సభాసంఘానికి నాయకత్వం వహిస్తున్న తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. తాము లోతైన విచారణ జరిపిన తర్వాత చంద్రబాబు, లోకేష్ పాత్రకు ఆధారాలు దొరికినట్లు చెప్పారు.

తొందరలోనే తమ నివేదికను అసెంబ్లీకి అందించనున్నట్లు కూడా చెప్పారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసి మరింత లోతైన దర్యాప్తు చేయాల్సుంటందని భూమన అభిప్రాయపడ్డారు. అంతా బాగానే ఉందికాని సభాసంఘం విచారణలో చంద్రబాబే దోషని తేల్చారు సరే. మరిపుడు చంద్రబాబును ఏమి చేయబోతున్నారు ? ఏమి చేయగలరు ? అన్నదే కీలకమైన పాయింట్. సభా సంఘం చంద్రబాబును తప్పుపట్టినంత మాత్రాన ఏమైపోతుంది ? గతంలో రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రుల కమిటి తేల్చింది.

అప్పట్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ కు చంద్రబాబే సూత్రదారని కూడా మంత్రుల కమిటి నిర్ధారించింది. చంద్రబాబు పాత్ర విషయంలో అన్నీ ఆధారాలున్నాయని కూడా మంత్రులు చెప్పారు. తీరా యాక్షన్ తీసుకునే సమయంలో ఏమి జరిగింది ? కమిటి ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు కోర్టుకెళ్ళారు. కేసు విచారణలో ఇన్ సైడర్ ట్రేడింగే జరగలేదని కోర్టు తేల్చేసింది. రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్న పద్దతే వర్తించదని కూడా చెప్పింది. ఏ విషయంలో తీసుకున్నా చంద్రబాబును ఏదో చేద్దామని ప్రభుత్వం ప్రయత్నించటం చివరకు అభాసుపాలవ్వటమే జరుగుతోంది. కాబట్టి చంద్రబాబును ఏదో చేద్దామన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంటే మంచిది. ఎందుకంటే చంద్రబాబును ఈ ప్రభుత్వం ఏమీ చేయలేందన్న విషయం జనాలకు కూడా బాగా తెలిసిపోయింది. కాబట్టి ఈ సభాసంఘాలు, విచారణ, ప్రకటనలన్నీ కేవలం మీడియాలో హడావుడి చేయటానికి మాత్రమే పనికొస్తాయి.