ఇదేంది థాక్రేకి మరో గట్టి దెబ్బ ?

మహారాష్ట్రలో సంకీర్ణప్రభుత్వ సంక్షోభం నానాటికీ పెద్దదయిపోతోంది. ఇప్పటికే మంత్రి ఏక్ నాధ్ షిండే నాయకత్వంలో మంత్రులు, ఎంఎల్ఏలు అంతా కలిపి సుమారు 40 మంది తిరుగుబాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏల సంఖ్య ఎంతన్నది కచ్చితంగా తెలియకపోయినా షిండే వర్గానిదే మెజారిటి అని తెలుస్తోంది. తిరుగుబాటు లేవదీసిన ఎంఎల్ఏలను ఎలా దారికితెచ్చుకోవాలో అర్ధంకాక సీఎం థాక్రే బుర్రగోక్కుకుంటున్నాడు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంపీల్లో కూడా తిరుగుబాటు మొదలైనట్లు వార్తలు మొదలయ్యాయి. శివసేనకు 19 మంది ఎంపీలున్నారు. వీరిలో ఏకంగా 14 మంది థాక్రేపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. వీరంతా ఇప్పుడు షిండేతో టచ్ లో ఉన్నారట. అంతకుముందు నుండే బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. సో జరుగుతున్నది చూస్తుంటే థాక్రేకి ముందు ముందు చాలా పెద్ద సమస్య తప్పేట్లులేదు.

నిజానికి ఇప్పటికిప్పుడు ఎంపీల్లో చీలిక తీసుకురావాల్సిన అవసరం బీజేపీకి లేదు. అయినా ఎందుకిలా ప్రయత్నిస్తోంది ? ఎందుకంటే తనను వదిలేసి ఎన్సీపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపినప్పటినుండి శివసేనంటే బీజేపీ మండిపోతోంది. సంవత్సరాల తరబడి తనతో ఎంతో నమ్మకంగా ఉన్న శివసేన హఠాత్తుగా చెయ్యిచ్చి పై రెండుపార్టీలతో చేతులు కలపటాన్ని బీజేపీ తీరని అవమానంగా భావిస్తోంది. అవకాశం వచ్చినపుడు అంతకంత దెబ్బతీయాలని ఎదురు చూస్తున్నది.

అయితే బీజేపీ ఎదురుచూసిన అవకాశం రెండేళ్ళయినా రాలేదు. సంకీర్ణప్రభుత్వం హ్యాపీగా గడచిపోతోంది. మరో రెండేళ్ళల్లో షెడ్యూల్ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. కొడితే ఇప్పుడే శివసేనను దెబ్బకొట్టాలని కమలంపార్టీ నేతలు అనుకున్నారు. అందుకనే థాక్రేపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న షిండేని బాగా కెలికేసింది. బీజేపీ వలలో షిండే కూడా పడిపోయారు. వెంటనే పాచికలు వేసి షిండేని రెచ్చగొట్టింది. దాంతో రెచ్చిపోయిన షిండే పెద్దసంఖ్యలోనే ఎంఎల్ఏలను రెచ్చగొట్టి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఎంఎల్ఏల తిరుగుబాటుతోనే కిందా మీదా అవుతున్న థాక్రే ఎంపీలు కూడా తిరగబడితే అంతే సంగతులు.