వైసీపీకి పృథ్వీ త‌ల‌పోటు

2019 ఎన్నిక‌ల‌కు ముందు క‌మెడియ‌న్ పృథ్వీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై ఒక రేంజిలో రెచ్చిపోయి కామెంట్లు చేయ‌డం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఎస్వీబీసీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్ట‌డం.. కానీ ఓ మ‌హిళ‌తో స‌ర‌స సంభాష‌ణ సాగించ‌డంతో ఆయ‌న ప‌ద‌వి ఊడిపోవ‌డం తెలిసిందే. వైసీపీలో వేరే నేత‌ల మీద కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లున్నా, వాళ్లూ వివాదాల్లో చిక్కుకున్నా.. వారిపై మాత్రం చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా పృథ్వీని మాత్రం సాగ‌నంపేశారు.

ఆ ప‌రిణామం త‌ర్వాత కొంత‌కాలం మౌనంగా ఉన్న‌ పృథ్వీ.. ఈ మ‌ధ్య వైసీపీని గ‌ట్టిగా టార్గెట్ చేస్తుండడం విదిత‌మే. వ‌రుస‌బెట్టి యూట్యూబ్ ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ జ‌గ‌న్ మీద‌, వైసీపీ మీద గ‌ట్టిగానే విమ‌ర్శ‌లు చేశాడు పృథ్వీ. దీనిపై వైకాపా నుంచి పెద్ద‌గా స్పంద‌న అయితే లేదు. పృథ్వీని, అత‌డి వ్యాఖ్య‌ల్ని వాళ్లు లైట్ తీసుకుంటూనే వచ్చారు.

కానీ పృథ్వీ కామెంట్ల‌ను టీడీపీ, జ‌న‌సేన వాళ్లు సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ చేస్తున్నారు. ఇప్పుడిక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వ‌హించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పృథ్వీ పాల్గొన‌డం.. వైకాపా మీద ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం, తాను చేసిన త‌ప్పిదాల‌కు లెంప‌లేసుకోవ‌డంతో స‌ద‌రు వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. అమ‌రావ‌తి రైతులు పెయిడ్ ఆర్టిస్టులంటూ తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై విచారం వ్య‌క్తం చేస్తూ, చేతులెత్త న‌మ‌స్కారం పెట్టి మ‌రీ వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు పృథ్వీ.

అంతే కాక వైసీపీలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను తిట్టేందుకు, ఆరోప‌ణ‌లు గుప్పించేందుకు ఎలా ట్రైనింగ్ ఇస్తారో కూడా పృథ్వీ వెల్ల‌డించాడు. పాకిస్థాన్‌లో ఉగ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ ఇచ్చిన త‌ర‌హాలో ఇది జ‌రుగుతుంద‌ని, త‌న‌ను కూడా ఒక వ్య‌క్తి బాగా ప్ర‌భావితం చేసి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను దారుణంగా తిట్టించాన‌ని, అప్పుడు తాను కూడా ఉగ్ర‌వాదిలాగే వ్య‌వ‌హ‌రించాన‌ని పృథ్వీ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ వాళ్లు ఇప్ప‌టిదాకా పృథ్వీని లైట్ తీసుకున్నారు కానీ.. రోజు రోజుకూ అత‌డి ఇంట‌ర్వ్యూల‌కు రీచ్ పెరిగిపోతుండగా.. జ‌నాల్లో వ్య‌తిరేక‌త పెరుగుతున్న త‌రుణంలో పృథ్వీ లాంటి వాళ్లు చేసే డ్యామేజ్ గ‌ట్టిగానే ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.