బాబు స్పీడ్: నెలకు రెండు జిల్లాల్లో పర్యటన

మహానాడు సక్సెస్ స్పూర్తిని కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే నెలకు రెండుజిల్లాల్లో పర్యటించబోతున్నట్లు పార్టీనేతలతో చెప్పారు. తొందరలోనే తన పర్యటనకు సంబంధించిన ప్లాన్ డిసైడ్ చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో పెరిగిపోయిన వ్యతిరేకతే మహానాడు విజయానికి కారణమైందని అభిప్రాయపడ్డారు.

అప్పుడెప్పుడో ఎన్టీయార్ హయాంలో విజయవంతమైన మహానాడును తాజా మహానాడు విజయవంతం గుర్తుకు తెచ్చిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిపోయిన వ్యతిరేకతను పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవాలన్నారు. ఇందుకని ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను జనాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కు రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదని తేల్చేశారు. తన అసమర్ధపాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలుచేయటంతో పాటు యువత భవిష్యత్తుని నాశనం చేసినట్లు మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాలను చాటి చెప్పేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను రంగాలవారీగా కార్యక్రమాలను తయారుచేయాలన్నారు. కొత్త ఓట్ల నమోదు, పాత ఓటర్ల తొలగింపు లాంటి అంశాలపై నేతలంతా బాగా దృష్టిపెట్టాలని గట్టిగా చెప్పారు. ప్రతి జిల్లాలోను మినీ మహానాడును కచ్చితంగా మూడు రోజులు నిర్వహించాలన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని జనాలకు చేరువయ్యేందుకు బాగా ఉపయోగపడుతుందన్నారు.

మూడు రోజుల మినీ మహానాడు లో కచ్చితంగా ఒకరోజు బహిరంగ సభ నిర్వహించాలన్నారు. ఇందులో జిల్లాలోని నేతలు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు. అంతా బాగానే ఉంది కానీ ఈనెల మొదట్లో తాను మొదలుపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఏమి చేయబోతున్నారో చంద్రబాబు చెప్పలేదు. ఈ కార్యక్రమం మధ్యలో ఉండగానే మహానాడు జరిగింది. మళ్ళీ ఇపుడు కొత్తగా తాను నెలకు 2 జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. దీంతో బాదుడే బాదుడు కార్యక్రమం కంటిన్యూ అయ్యే విషయంలో నేతల్లో అయోమయం మొదలైంది. ఈ విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. ఒకవైపు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మళ్ళీ నెలకు 2 జిల్లాల్లో పర్యటించాలంటే కష్టమే.