ప్ర‌తి జిల్లాలోనూ టీడీపీ అన్న‌క్యాంటీన్లు

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌ల‌ను ముందుకు తెచ్చింది. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చేరువైన‌.. అన్న క్యాంటీన్ల‌ను వైసీపీ స‌ర్కారు మూసివేసిన నేప‌థ్యంలో ఇప్పుడు పార్టీ ఆధ్వ‌ర్యంలోనే ఈ క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని.. జిల్లాకు ఒక‌టి చొప్పున ఏర్పాటు చేయాల‌ని.. చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లును వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మూసి వేయడం అప్ప‌ట్లోనే సంచ‌ల‌నం సృష్టించింది. క్యాంటీన్ల‌ను మూసివేయ‌డంపై పార్టీల‌కు అతీతంగా పేద‌లు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

అయితే.. త్వ‌ర‌లోనే మ‌రో రూపంలో ఈ క్యాంటీన్ల‌ను ప్రారంభిస్తామ‌ని.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ 2020 జ‌న‌వ‌రిలో ప్ర‌క‌టించారు. దీంతో ఆశ‌లు చిగురించాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వీటి ఊసు లేకుండా పోయింది. అప్ప‌టి నుంచి కూడా పేద‌లు.. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కుచెందిన‌వారు.. కార్మికులు.. ఉపాధి కూలీలు.. ఈ క్యాంటీన్ల‌ను ఎప్పుడు తెరుస్తారా? అని ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్ప‌ట్లో ఈ క్యాంటీన్ల‌ను ప్ర‌భుత్వం తెర‌వ‌ద‌ని.. అస‌లు.. ఈ క్యాంటీన్ల‌ను కూడా రాజ‌కీయ కోణంలోనే చూసింద‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ‌న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన మ‌హానాడులో చంద్ర‌బాబు.. త్వ‌ర‌లోనే జిల్లాలో ఒక క్యాంటీన్ చొప్పున మొత్తం 26 క్యాంటీన్ల‌ను పార్టీ ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను ఎన్నారై టీడీపీ కూడా ముందుకు వ‌చ్చింది. క్యాంటీన్లు ప్రారంభిస్తే.. తాము స‌హ‌కరిస్తామ‌ని.. ఎన్నారైలు ప్ర‌క‌టించారు. అన్నా క్యాంటీన్లు మూసివేతతో మధ్యాహ్న భోజనానికి పేదలు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, ఉపాధి కూలీలు పడుతున్న ఇబ్బందులను చూసి తిరిగి అటువంటి కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చంద్ర‌బాబు న‌డుం బిగించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో అన్నా క్యాంటీన్లును తిరిగి ప్రారంభిస్తామని, ఈలోపు ర‌ద్దీ ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వ‌ర్యంలోనే వీటిని ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని.. చంద్ర‌బాబు సూచించిన‌ట్టు త‌మ్ముళ్లు తెలిపారు. దీనికి సంబంధించి ప‌నులు కూడా ప్రారంభ‌మైన‌ట్టు స‌మాచారం. ఎక్క‌డెక్కడ వీటిని నిర్మించాలి.. ఎవ‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించాలి. విరాళాలు ఎలా సేక‌రించాలి..అనే విష‌యాల‌పై పార్టీ కీల‌క నేత‌లు చ‌ర్చ జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. అవ‌స‌ర‌మైతే.. స్థ‌లాలు దొర‌క‌ని ప‌క్షంలో టీడీపీ కార్యాల‌యాల్లోనే క్యాంటీన్లు ఏర్పాటు చేయాల‌ని.. బావిస్తున్న‌ట్టు నాయ‌కులు చెబుతున్నారు.