మాట నిలబెట్టుకున్న సీఎం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సీఎంగా బాధ్యతలు తీసుకోకముందే ప్రకటించారు. అవినీతికి పాల్పడిన వారు తమ పార్టీ వారే అయినా మంత్రులైనా సరే ఉపేక్షించేది లేదని అప్పట్లోనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సీన్ కట్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతోంది.

హఠాత్తుగా మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. విషయం ఏమిటంటే ఆరోగ్యశాఖకు సంబంధించిన ప్రతి కాంట్రాక్టులోను తనకు 1 శాతం కమీషన్ గా ఇవ్వాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారట. ఈ విషయం తెలియగానే మంత్రిపై భగవంత్ నిఘా పెట్టారు. ఆధారాలతో సహా పట్టుకున్నారు. వెంటనే మంత్రివర్గంలో నుండి సింగ్లాను తీసేయటం, ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేసి అరెస్టు చేయటం చకచకా జరిగిపోయింది.

గతంలో ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఒక మంత్రి అవినీతికి పాల్పడుతున్నారని తెలియగానే ఆయన్ను తొలగించారు. కేసు కూడా నమోదు చేశారు. సో అరవింద్ అడుగుజాడల్లోనే భగవంత్ కూడా నడుస్తున్నట్లున్నారు. ఇందుకే కేజ్రీవాల్ ప్రభుత్వం మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు రావడం లేదు. మంత్రులు, ఎంఎల్ఏలను అవినీతికి దూరంగా ఉంచుతున్నారు. వాస్తవాలను పక్కనపెట్టేస్తే కనీసం ఆరోపణలకు కూడా అవకాశం లేనట్లు కేజ్రీవాల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయినా పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే సింగ్లా ఇలాంటి కక్కుర్తికి పాల్పడతారని ఎవరూ ఊహించలేదు. ఏదేమైనా అవినీతికి వ్యతిరేకంగా భగవంత్ చేసిన పనికి సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తోంది. అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవినీతి విషయంలో ఇలాగే వ్యవహరిస్తే అవినీతి దాదాపు నియంత్రణలోకి రావటం ఖాయం. కానీ చాలా ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్న కారణంగానే అవినీతి పెట్రేగిపోతోంది. మరి అవినీతి అంతానికి ఎంతమండి కేజ్రీవాల్లు, భగవంత్ మాన్లు రావాలో ఏమో.