అడ్రస్ లేని మాజీ మంత్రి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ మంత్రి అడ్రస్ ఎక్కడా కనబడలేదు. చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లా పర్యటనలో సీనియర్లందరూ కనిపించారు కానీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాత్రం ఎక్కడా కనబడలేదు. అఖిలకు చాలాకాలంగా పార్టీతో గ్యాప్ కంటిన్యూ అవుతోంది. అఖిల అనేక కేసుల్లో ఇరుక్కుంటున్నారు.

అఖిల దంపతులు, తమ్ముడు భూమా జగద్విఖ్యాత రెడ్డి పై దాడులు, ఫోర్జరీ, కిడ్నాప్, హత్యా ప్రయత్నాల్లాంటి అనేక ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఒక రియాల్టర్ కిడ్నాప్ కేసులో భూమాను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు కూడా పంపారు. భర్త భరద్వాజ్, తమ్ముడు చాలాకాలం తప్పించుకుని తిరిగి చివరకు ముందస్తు బెయిల్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. అఖిల అరెస్టు సమయంలో కానీ రిమాండు నుండి బయటకు వచ్చిన తర్వాత కానీ చంద్రబాబు, లోకేష్ ను కలవటానికి గట్టిగానే ప్రయత్నించారు.

అయితే డైరెక్టుగా కాదు కదా చివరకు ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఆ తర్వాత కూడా ఫోర్జరీ సంతకాలు, కరోనా వైరస్ సర్టిఫికేట్లు చూపటంలో తప్పుడు సర్టిఫికేట్లు పెట్టారని, ప్రత్యర్ధులపై దాడులు చేయటం, దగ్గర బంధువులని కిడ్నాప్ చేయటం లాంటి అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. దీనికి అదనంగా మొదటి నుంచి ఆమె మనస్తత్వం కూడా విచిత్రంగా ఉంది. ఇటు సీనియర్లతోను ఆమెకు పడటం లేదు, అటు దగ్గర వాళ్ళని దూరం చేసుకున్నారు.

ఎదుటి వాళ్ళకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటమనే మనస్తత్వం కారణంగానే పార్టీలో అఖిల ఒంటరైపోయారు. ఆమెను పార్టీ కార్యక్రమాలకు పిలవడం మానేశారు. ఆమె కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. మిగిలిన కార్యక్రమాలు ఎలాగున్నా పార్టీ అధినేత జిల్లాకు వచ్చినపుడు అఖిల వస్తారని అనుకున్నారు. అయితే ఆమె ఎక్కడా కనబడలేదు. మరి విడిగా ఏమన్నా కలిశారేమో తెలీదు. అఖిల విచిత్రం ఏమిటంటే పార్టీని వదిలి పెట్టలేదు, పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం లేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.