రేవంత్ అదిరిపోయే హామీ: 30 రోజుల్లో 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ!!

తెలంగాణ‌లోని టీఆర్ఎస్‌ పాలనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌ పాలనలో ధనిక రాష్ట్రం అస్తవ్యస్తమైందని ఆరోపించారు. ఏమీ చేయకుండానే రూ.5లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక… మొదటి 30 రోజుల్లోనే 2 లక్షలు మాఫీ చేస్తామమన్నారు. రైతులను పూర్తిగా రుణవిముక్తులను చేయడం తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు.

ఆ తరువాత బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగేళ్లలో వడ్డీతో కలిపి బ్యాంకులకు చెల్లిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న అంచనాతోనే వరంగల్‌ రైతు డిక్లరేషన్ ప్రకటించినట్లు వివరించారు. పేదలకు రైతుబంధు ఇవ్వాల్సి ఉండగా… ధనికులకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించిన రేవంత్… అర్హులకు మాత్రమే రైతుబంధు ఇస్తామన్నారు. ఏడేళ్లలో కేసీఆర్‌ 5లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు.

“రైతులకు రుణ విముక్తి కల్పిస్తాం. మొదటి 30 రోజుల్లోనే రూ.2లక్షలు మాఫీ చేస్తాం. విడతలవారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 15 శాతం రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చును పూర్తిగా తగ్గిస్తాం. అర్హులకు మాత్రమే రైతుబంధు ఇస్తాం. కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఏమీ చేయకుండానే 5లక్షల కోట్లు అప్పులు చేశారు. సాగునీటి వసతి పెరిగినందునే వరిసాగు విస్తీర్ణం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం 30లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఎందుకు ఉచిత విద్యుత్త్ ఇస్తోంది?” అని విమ‌ర్శించారు.

గతంలో హైదరాబాద్‌ చుట్టు పక్కల వ్యవసాయ భూములుండేవని వివిధ రకాల పంటలు పండేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని విమ‌ర్శించారు. చిత్తూరు నుంచి చక్కెర కొనుగోలు చేయడంతో వచ్చే కమీషన్‌ కోసమే తెలంగాణ రాష్ట్రంలో చెక్కర పరిశ్రమను మూసివేయించారని రేవంత్ విరుచుకుప‌డ్డారు. నూతన వ్యవసాయ విధానం తీసుకురావడం ద్వారా…పంటల సాగు విషయంలో రాష్ట్రంలో గందరగోళం పరిస్థితులు ఉండవన్నారు. దేశంలో ఏ వ్యాపారైనా తాను ఉత్పత్తి చేసిన వస్తువులపై తానే ధర నిర్ణయించుకుంటాడని, కానీ రైతులు పండించిన పంటపై కొనుగోలుదారులు నిర్ణయిస్తున్నారని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.