తాజ్‌మ‌హ‌ల్ మాదే.. షాజ‌హాన్ లాగేసుకున్నారు

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ హ‌యాంలో బాబ్రీమ‌సీదు వివాదం ఎలాంటి మ‌లుపు తిరిగిందో అంద‌రికీ తెలిసిందే. చివ‌ర‌కు అక్క‌డ రామాల‌యం కూడా నిర్మిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజ్ మ‌హ‌ల్ విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ప్ర‌పంచ  ప్రేమికులకు కేరాఫ్‌గా ఉన్న తాజ్‌మహ‌ల్‌.. గ‌డిచిన రెండు వారాలుగా వివాదాల‌కు కేంద్రంగా మారింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. మెుఘల్‌ చక్రవర్తి అయిన షాజహాన్‌, ముంతాజ్‌ ప్రేమకు చిహ్నాంగా తాజ్‌మహల్‌ను చెప్పుకుంటారు.

ఇప్పుడు ఈ తాజ్ మ‌హల్‌లో మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని.. ఆ గుట్టు తేల్చడానికి ఆ గదులను తెరిచేలా భారత పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని అలహాబాద్‌ హైకోర్టులో ఇటీవలే వ్యాజ్యం దాఖలైంది. తాజ్ మహల్‌లో హిందూ విగ్రహాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దానిపై నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలని అలహాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్‌ను పిటిషనర్‌, బీజేపీ అల‌హాబాద్ జిల్లా అధ్య‌క్షుడు కోరారు. అనంతరం ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాతో దీనిపై నివేదిక ఇప్పించాలని న్యాయస్థానాన్ని కూడా ఆయ‌న‌ అభ్యర్థించారు. దీంతో తాజ్ మ‌హ‌ల్ వివాదాల‌కు నిల‌యంగా మారిందనే చ‌ర్చ వ‌చ్చింది.

దీనిపై ఇంకాచ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో.. బీజేపీ మ‌హిళా ఎంపీ ఒక‌రు.. అస‌లు తాజ్ మహల్ ఉన్న చోటు జైపుర్ రాజకుటుంబానికి చెందిన ఆస్తి అని కొత్త వాద‌న తీసుకువ‌చ్చారు. ఆమే.. రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ త‌మ స్థ‌లాన్ని బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేష‌న్‌ పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని దియా సంచ‌ల‌నం సృష్టించారు. తాజ్ మహల్.. జైపుర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆస్తి అని, దాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో బలవంతంగా లాక్కున్నారని తెలిపారు.

తాజ్మహల్ తమదే అని నిరూపించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాజ్ మహల్ ఉన్న చోటు మొదట జైపుర్ రాజ కుటుంబానికి చెందింది. షాజహాన్కు ఆ ప్రదేశం నచ్చి బలవంతంగా లాక్కున్నారని దియా తెలిపారు. “అప్పట్లో చట్టాలు, కోర్టులు లేవు. ప్రజలు ఎదిరించాలంటే భయపడేవారు. తాజ్ మహల్ ఉన్న చోటును తీసుకున్నందుకు షాజహాన్ కొంత పరిహారం ఇచ్చారని విన్నాను. తాజ్ మహల్ స్థలం మాదే అనేందుకు మా వద్ద పత్రాలున్నాయి. కోర్టు అడిగితే వాటిని సమర్పిస్తాం“ అని దియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాయి. ఇక‌, మున్ముందు.. రామ‌జ‌న్మ భూమి మాదిరిగా.. ఇది కూడా వివాదంగా మారుతుందా.. లేక ఇక్క‌డితో ఆగుతుందా.. చూడాలి.