బ్యాంకులు చేస్తున్న నిర్వాకాలు.. అన్నీ ఇన్నీ కావు. సామాన్యులకు ఓ పదివేలు అప్పు ఇవ్వమంటే.. లక్ష సందేహాలు.. నిశిత పరిశీలన.. శూల శోధన చేసే బ్యాంకులు.. వందల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయి. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మోహుల్ చోక్సీ వంటి వారు వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే కిక్కురుమనని బ్యాంకులు సాధారణ వ్యక్తులు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడంటే ఇంటికి వెళ్లి తాళం వేస్తుంటాయి. సహజంగా బ్యాంకుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా చెప్పే మాటే ఇది.
అయితే బ్యాంకులు ఇంతకన్నా క్రూరంగా వ్యహరిస్తాయని గుజరాత్లో వెలుగు చూసిన ఒక సంఘటన తెలుసుకుంటే అర్థం అవుతుంది. కేవలం 31 పైసల బాకీ ఉన్నాడని ఒక రైతును కోర్టుకు లాగేసింది. అంతేకాదు.. ‘నో డ్యూ సర్టిఫికెట్’ ఇవ్వకుండా.. ఆ రైతుకు ముప్పు తిప్పలు పెట్టింది. దేశంలోని అత్యున్నత బ్యాంకుగా పేరు తెచ్చుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతును తీవ్ర ఇబ్బందులు పెట్టి జాతీయస్థాయిలో పరువు పోగొట్టుకుంది.
ఏం జరిగిందంటే..
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ సమీపంలోని ఖోరజ్ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్ అనే వ్యక్తి తన భూమిని ఇద్దరికి 2020లో విక్రయించాడు. అయితే గతంలో ఈ భూమిపై మూడు లక్షల రూపాయలు ఎస్ బీఐ బ్యాంకు నుంచి శ్యాంజీ రుణం తీసుకున్నాడు. అయితే నీరవ్ మోడీ..విజయ్ మాల్యాల మాదిరిగా ఆయన ఎగ్గొట్టకుండా.. క్రమంతప్పకుండా తిరిగి చెల్లించాడు. అయితే.. ఈ అప్పు తీరిపోయిన నేపథ్యంలో భూమిని అమ్మేశాడు. అయితే.. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు జరగ లేదు.
దీనికి కారణం బ్యాంకు నుంచి అప్పుకు సంబంధించిన నో డ్యూ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై వాళ్లు కోర్టును ఆశ్రయించగా బ్యాంకు కూడా కోర్టులో దావా వేసింది. ఇరు వర్గాల తరపు వాదనలు వినిపించి న్యాయవాది ఆశ్చర్యపోయే విషయం వెల్లడించారు. శ్యాంజీ బ్యాంకుకు 31 పైసలు బాకీ ఉన్నాడని.. అందుకే సర్టిఫికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇది చెల్లిస్తే.. ఇస్తామని చెప్పాడు. వాస్తవానికి 50 పైసల కంటే తక్కువ బాకీ ఉంటే లెక్కలోకి రాదు. ఇక, బ్యాంకు వారి వాదనలు విన్న న్యాయమూర్తికి చిర్రెత్తుకొచ్చింది.
బ్యాంకుకు చీవాట్లు పెట్టి రైతు శ్యాంజీకి సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు.. రైతును కోర్టుకు లాగినందుకు.. కోర్టు ఖర్చుల కింద 25 వేలు ఇవ్వాలని.. దీనిని 12 శాతం వడ్డీతో.. నెలలోగా చెల్లించాలని.. ఆదేశించారు. ఇదీ.. బ్యాంకు వారి బాగోతం! అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. నిజమే కదా!! వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టినోళ్లను వదిలేసి.. ఇలా 31 పైసల కోసం పట్టుకోవడం ఏంటి? అనే మాట జోరుగా వినిపిస్తోంది.
This post was last modified on April 29, 2022 11:17 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…