జగన్, కేసీఆర్: సేమ్ డే, సేమ్ సీన్

కాకతాళీయమో ఏమోగానీ తెలుగు ముఖ్యమంత్రులిద్దరు చెప్పింది ఒకేమాట. ఒకేరోజున తెలంగాణలో కేసీయార్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఇద్దరు కూడా తమ నేతలకు చేసిన దిశానిర్దేశం ఒకేలాగుంది. కేసీయార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా ఏకతాటిపై నిలబడి ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు.

విజయవాడలో జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్లు, ఎంఎల్ఏలు ఒక్క టీంగా పని చేస్తే కానీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదన్నారు. వ్యక్తుల కన్నా తనకు పార్టీయే ముఖ్యమని స్పష్టంగా చెప్పారు. పార్టీ బాగుంటేనే మనమంతా బాగుంటామన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. మొత్తం మీద కేసీయార్ అయినా జగన్ అయినా చెప్పిందేమంటే నేతల మధ్య విబేధాలు మరచిపోయి పార్టీ గెలుపు కోసం కష్టపడాలని.

పార్టీ గురించి జనాల అభిప్రాయం విషయంలో తాను సర్వే చేయిస్తున్నట్లు కేసీయార్ ప్రకటించారు. ఇదే విషయమై జగన్ మాట్లాడుతూ రెగ్యులర్ గా తాను ప్రభుత్వం, మంత్రులు, ఎంఎల్ఏలపై జనాల్లోని సంతృప్తస్ధాయిపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. చేయిస్తున్న సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయమై ఎలాంటి అనుమానాలు లేవని ఇద్దరు చెప్పటం గమనార్హం.

ఇదే విషయమై జగన్ మాట్లాడుతూ అధికారంలోకి రావటంలో ఎలాంటి అనుమానం లేదని కాకపోతే ఇప్పుడునన్ని సీట్లు మళ్ళీ వచ్చి తీరాలన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మూడేళ్ళల్లోనే సంక్షేమ పథకాలకు రు. 1.37 లక్షల కోట్లు వ్యయం చేసిన తర్వాత 175కి 175 సీట్లూ వచ్చి తీరాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీని గెలిపించాలని జనాలు అనుకుంటున్నట్లు జగన్ తెలిపారు. కుప్పంలోనే వైసీపీ గెలిచేట్లుంటే 175 సీట్లూ ఎందుకు గెలవకూడదని ప్రశ్నించారు. మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రులు తమ నేతలకు ఒకేరకమైన దిశానిర్దేశం చేయటం విచిత్రంగానే ఉంది.