గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కేసీఆర్‌కు మ‌ధ్య జరుగుతున్న వివాదం స‌రికొత్త మ‌లుపుతిరిగింది. తాజాగా కేసీఆర్ మ‌రింత తీవ్ర‌స్థాయిలో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై మండిప‌డ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. “గవర్నర్ వేస్ట్‌. ఈ వ్యవస్థ దుర్మార్గంగా మారింది. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో నడుస్తోంది“ అని చెప్పారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారన్నారు. తమిళనాడులో పంచాయితీ, బెంగాల్‌లో సైతం పంచాయితీ నడుస్తోందన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రజల బలంతో గెలిచిన ఎన్టీఆర్ దుర్మార్గపు గవర్నర్ వ్యవస్థను గద్దె దించారన్నారు. అదే ఎన్టీఆర్‌ను ప్రజలు తిరిగి గద్దెను ఎక్కించారన్నారు. దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలన్నారు. అందులో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు.

రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిన గవర్నర్‌ వ్యవస్థను.. ఇప్పుడు దుర్మార్గంగా మార్చేశారని సీఎం కేసీఆర్‌ ఆక్షేపించారు. మహారాష్ట్రలో కీలకమైన ఓ ఫైల్‌ను అక్కడి గవర్నర్‌ ముందుకు కదలనీయకుండా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. తమిళనాడులోనూ ఓ బిల్లు విషయంలో అదే పరిస్థితి. మహారాష్ట్ర, బెంగాల్‌, కేరళ, తమిళనాడు.. ఇలా ఏ రాష్ట్రం చూసినా గవర్నర్‌ల పంచాయితీ చూస్తున్నాం.. అన్నారు.

“దివంగత ఎన్టీఆర్‌.. పార్టీ పెట్టినప్పుడు మేమూ ఆయనతో పని చేశాం. అద్భుతమైన మెజార్టీతో ఆయన అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా ఇదే దుర్మార్గమైన రీతిలో గవర్నర్‌ వ్యవస్థను ఉపయోగించి.. స్వచ్ఛమైన పాలన అందించిన ఎన్టీఆర్‌ను సీఎం పీఠం నుంచి దించేశారు.“ అని తెలిపారు.  

“ఇదెక్కడో భారత రామాయణ గాథలు నుంచి చెప్తోంది కాదు. ఇదే హైదరాబాద్‌ గడ్డపైన జరిగింది. తామే గొప్పనుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని.. మెడలు వంచి ఎన్టీఆర్‌ను మళ్లీ సింహాసనం మీద కూర్చోబెట్టారు తెలుగు ప్రజలు. ఎన్టీఆర్‌తో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్‌ ఏమయ్యాడు?.. చివరకు తొలగించబడ్డాడు.. అవమానకర రీతిలో రాష్ట్రం విడిచి వెళ్లిపోయాడు. జరిగిన చరిత్రే కదా. దాని నుంచైనా బుద్ధి రావొద్దా? ఇది చూసైనా ప్రజాస్వామ్యంలో పరిణితి నేర్చుకోవద్దా?“ అని ప్ర‌స్తుత గ‌వ‌ర్న‌ర్‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా నిప్పులు చెరిగారు.

కానీ, ఇప్పుడేం జరుగుతోంది?.. ఉల్టా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వక్రమార్గంలో.. రాజ్యాంగబద్ధమైన ఒక పదవిని దుర్వినియోగపరుస్తున్నారు అంటూ త‌మిళ‌సై పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరగాలని.. జాతి పితను చంపిన హంతకులను పూజించడం దుర్మార్గమన్నారు. మత పిచ్చితో దేశాన్ని ఎటువైపు తీసుకు వెళుతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు.