తెలంగాణా కాంగ్రెస్ కు పెద్ద సమస్యొచ్చిందే ?

తెలంగాణా కాంగ్రెస్ నేతలకు పెద్ద సమస్యొచ్చింది. జాతీయస్థాయిలో పార్టీ పునరుజ్జీవనానికి సేవలు అందించటానికి అంగీకరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెలంగాణాలో కేసీయార్ కు కూడా సలహాదారుడిగా ఉండటమే వీళ్ళ ఇబ్బందులకు పెద్ద కారణమవుతోంది. నిజానికి అటు కాంగ్రెస్ అటు టీఆర్ఎస్ కు ఏకకాలంలో పనిచేయటం కష్టమనే చెప్పాలి.

జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్ అనుకున్నా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో మాత్రం అలా సాధ్యం కాదు. ఎందుకుంటే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీయార్ అనేక వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే ఒకవైపు బీజేపీని మరోవైపు కాంగ్రెస్ ను బుల్డోజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇదే సమయంలో కేసీయార్ ను దెబ్బకొట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అంటే రాష్ట్రస్థాయిలో టీఆర్ఎస్-కాంగ్రెస్ బద్ధ శతృవులుగా ఉన్న విషయం అందరూ చూస్తున్నదే. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ లో పీకే చేరి సేవలందించటం మొదలుపెడితే దాని ప్రభావం తెలంగాణాలో కాంగ్రెస్ లీడర్లపైన పడుతుంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ కు పనిచేస్తు తెలంగాణాలో మాత్రం టీఆర్ఎస్ కు పనిచేయటమంటే అంత ఈజీకాదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పీకే రెండుపడవల్లో ప్రయాణం చేయాలని అనుకుంటున్నట్లుంది. ఇక్కడే కాంగ్రెస్ నేతలకు ఇబ్బందులు మొదలవ్వబోతున్నది.

స్వేచ్చగా కేసీయార్ పైన కాంగ్రెస్ నేతలు ఆరోపణలు, విమర్శలు చేసేందుకు లేదు. ఎందుకంటే జాతీయస్థాయిలో నాన్ బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫోల్డ్ లోకి కేసీయార్ ను తీసుకెళ్ళేందుకు పీకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే కేసీయార్ కూడా కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయాల్సుంటుంది. అప్పుడు తెలంగాణాలో నేతలకు కేసీయార్ పై నోరెత్తే అవకాశం కూడా ఉండదు. పైకి చిన్న సమస్యగా కనిపిస్తున్నా లోతుల్లోకి వెళితే మాత్రం చాలా పెద్ద సమస్యనే చెప్పాలి. జరుగుతున్న పరిణామాలను చూస్తే కేసీయార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పోరాటాలు చేసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరీ ఇబ్బందులను హస్తం నేతలు ఎలా అధిగమిస్తారో చూడాలి.