జగన్ మిస్సయిన పాయింట్ తో దూసుకెళ్తున్న పవన్

రాజకీయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న అవకాశాన్ని వదిలినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. అందుకే.. తమకు లబ్థి చేకూర్చే విషయాల్ని అస్సలు మిస్ కావు రాజకీయ పక్షాలు. అలాంటిది ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. అడిగిన వారికి.. అడగని వారికి.. ఉన్నా లేకున్నా.. కాదనకుండా తాయిలాల మీద తాయిలాలు ఇస్తూ మెస్మరైజ్ చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాష్ట్రం అప్పుల కుప్పలా మారుతుందన్న హెచ్చరికల్ని పట్టించుకోకుండా తాను నమ్మిన సంక్షేమ పథకాల అమలును సీఎం జగన్ ఆపటం లేదు.  

జగన్ ప్రభుత్వం చేసే తప్పుల్ని డైలీ బేసిస్ మీద ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టేసే చంద్రబాబు నాయుడు.. ఈ మధ్యన ఆ జోరును కాస్త తగ్గించారు. అదే సమయంలో గతంలో మాదిరి దూకుడు కాస్త తగ్గించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండటం.. తామేం చేసినా ప్రభుత్వ వ్యతిరేకత తాము అనుకున్న స్థాయిలో లేకపోవటంతో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే ఉదంతం ఏమైనా జరిగిన వెంటనే అక్కడకు ప్రత్యక్షమవుతున్న చంద్రబాబు  .. అధికారపక్ష వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ విరుచుకుపడుతున్నారు.

రాజకీయాలు అన్నాక ఇలాంటివి మామూలే. గతంలో తాను విపక్ష నేతగా ఉన్న సమయంలో.. తరచూ ఏదో ఒక ప్రజా సమస్యను టేకప్ చేసి ఆందోళనలు.. నిరసనల్ని నిర్వహించేవారు చంద్రబాబు. ఈసారి ఆ తీరుకు కాస్తంత కామా పెట్టినట్లుగా కనిపిస్తోంది. సరిగ్గా ఈ ఖాళీని భర్తీ చేసేందుకు వీలుగా రంగంలోకి దిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రైతులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. ఎవరికి పట్టని కౌలు రైతు కుటుంబాల కష్టాలు.. వారి కడగండ్లు.. సమస్యలతో పోరాటం చేయలేక ప్రాణాలు తీసుకున్న కౌలు రైతులకు తనకు తోచిన ఆర్థిక సాయాన్ని ఇస్తూ కొత్త తరహా రాజకీయానికి తెర తీస్తున్నారని చెప్పాలి.

ఇటీవల కాలంలో ఇప్పటికే పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలన్నింటికి తానే స్వయంగా వెళ్లి.. రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. విపక్షం.. అందునా ఒక్కటంటే ఒక్క సీటును మాత్రమే గెలిచి.. ఆ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ పంచన చేరిన వేళ.. కమ్ముకొచ్చే నిరుత్సాహాన్ని.. నిరాశను పక్కన పెట్టేసి.. రెట్టించిన ఉత్సాహంతో చేస్తున్న రైతు భరోసా యాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏమైనా.. జగన్, చంద్రబాబులు ఇద్దరూ మిస్ అయిన రైతు ఇష్యూను టేకప్ చేయటం ద్వారా.. అసలు సిసలు సమస్యల వెంట తాను ఉంటానన్న సంకేతాన్ని ఇచ్చారు పవన్ కల్యాణ్.