జీవీఎల్‌.. మండుతున్న రాజ‌కీయంలో పెట్రోల్ పోస్తావా?

దేశంలో `జేసీబీ` రాజకీయాలు మంట మండిస్తున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ స‌హా అన్ని విప‌క్షాలు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ, యూపీలోని యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారుల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. జేసీబీల‌ను మీ ఇళ్ల‌మీద‌కే పంపిస్తామ‌ని.. అప్పుడు ఎలాంటి వివాదాలు ఉండ‌వ‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బీజేపీ ఏపీకి చెందిన ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు.. ఈ రాజ‌కీయ మంట‌లో త‌న‌దైన శైలిలో పెట్రోల్ పోశారు.

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను జేసీబీల‌తో తొలగించడం ప్రారంభమైన కొద్ది సేపటికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ ఈ ఆక్రమణలను జేసీబీ (బుల్డోజర్)తో కూల్చుతున్న నేపథ్యంలో జేసీబీ అంటే `జీహాద్ కంట్రోల్ బోర్డ్` అని పేర్కొన్నారు.

జహంగీర్‌పురి ప్రాంతంలో ఇటీవ‌ల‌ హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా దాడులు జరిగాయి. ఈ కేసులో దాదాపు 25 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా, ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ ఈ ప్రాంతంలోని చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించింది, కొన్ని ఆక్రమణలను తొలగించింది. అనంతరం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఆక్రమణలను తొలగిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.

పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్లు వాదనలు వినిపించారు. దీంతో స్పందించిన సుప్రీం కోర్టు ఈ కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. తదుపరి విచారణ వాయిదా ప‌డింది. అయితే ఈ ఆదేశాలు వచ్చినప్పటికీ, ఎంసీడీ అధికారులు తమ పనిని కొనసాగించారు. సీపీఎం నేత బృందా కారత్ సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులకు అందజేయడంతో బుల్డోజర్లకు బ్రేక్ పడింది.

జీవీఎల్ నరసింహారావు ఇచ్చిన ట్వీట్‌లో, JCB =  జీహాద్ కంట్రోల్ బోర్డ్! అని పేర్కొన్నారు. దీంతో వివిధ పార్టీల నేతలు ఆయనపై మండిపడ్డారు. ఈ ఆక్రమణల తొలగింపు ప్రారంభ సమయంలోనే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం నేతలు బీజేపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో బుల్‌డోజ‌ర్ల బాగోతానికి జీహాద్‌ను ముడిపెడుతూ.. జీవీఎల్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత మంట‌లు రేపుతున్నాయి.