కేసీఆర్ కాపాడారు.. జ‌గ‌న్ చెడ‌గొట్టారు!

హైద‌రాబాద్ అభివృద్ధి కావ‌డానికి.. ఐటీ ప‌రిశ్ర‌మ ఇక్క‌డికి రావ‌డానికి ముఖ్య కార‌ణం టీడీపీ ప్ర‌భుత్వ‌మే.. ఇదీ త‌ర‌చూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పే మాట‌లు. ప్ర‌పంచ ప‌టంలో హైద‌రాబాద్‌ను నిలిపిన ఘ‌న‌త త‌న‌దేన‌ని ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. కానీ ఇప్పుడు కాస్త విభిన్న‌మైన మాట‌లు మాట్లాడారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగుడుతూ.. అటు ఏపీ సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూ బాబు వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా తెలంగాణ‌లో టీడీపీ బ‌లోపేతంపై దృష్టి సారించిన ఆయ‌న ఇక్క‌డి నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలో పార్టీ పుంజుకునే దిశ‌గా నాయ‌కులు ప‌ని చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఈ క్ర‌మంలోనే ఉమ్మ‌డి ఏపీలో ముఖ్య‌మంత్రిగా తాను చేసిన అభివృద్ధి ప‌నులు గురించి ప్ర‌స్తావించారు. త‌న హ‌యాంలో తీసుకొచ్చిన విధానాల వ‌ల్ల ఉమ్మ‌డి రాష్ట్రంలో అద్భుత‌మైన అభివృద్ధి జ‌రిగింద‌ని బాబు అన్నారు. అది త‌న‌కెంతో సంతృప్తినిస్తుంద‌ని చెప్పారు. త‌న త‌ర్వాత వ‌చ్చిన వాళ్లు అభివృద్ధిని చెడ‌గొట్ట‌లేదు కాబ‌ట్టి తెలంగాణ అద్భుత ఫ‌లితాలు సాధిస్తుంద‌ని చెప్పారు.

అంటే త‌న త‌ర్వాత ఉమ్మ‌డి ఏపీకి ముఖ్య‌మంత్రిగా చేసిన దివంగ‌త వైఎస్సార్‌, ఆ త‌ర్వాత ఇప్ప‌టి సీఎం కేసీఆర్‌ను బాబు ప్ర‌శంసించార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డినప్ప‌టి నుంచి జ‌రుగుతున్న అభివృద్ధికి త‌న హ‌యాంలోనే బీజం ప‌డింద‌నే అర్థం వ‌చ్చేలా బాబు మాట్లాడార‌ని చెబుతున్నారు.

ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో తొలి ముఖ్య‌మంత్రిగా తాను చేసిన అభివృద్ధిని ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ చెడ‌గొడుతున్నార‌నేలా బాబు మాట‌లున్నాయి. ఏపీలో అభివృద్ధిని చెడ‌గొట్టారు కాబ‌ట్టే ప‌త‌నావ‌స్థ‌కు చేరుకుందని ఆయ‌న అన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో బాబు బాగా హ‌ర్ట్ అయ్యార‌ని నిపుణులు అంటున్నారు. జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల విష‌యంపై అందుకే ప్ర‌జ‌ల‌తో పాటు టీడీపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంద‌ని చెబుతున్నారు. ఇలా బాబు మొత్తానికి కేసీఆర్‌ను ప్ర‌శంసిస్తూనే జ‌గ‌న్‌కు విమ‌ర్శించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.