మంత్రి ప‌ద‌వి ఆనందం.. అంత‌లోనే ఆగ‌మాగం!

జ‌గ‌న్ కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కుతుందో లేదో అని వైసీపీ నాయ‌కులు తెగ టెన్ష‌న్ ప‌డిపోయారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వాళ్ల‌కు ప‌ద‌వి రాక‌పోవ‌డంతో నిరాశ‌లో మునిగిపోయారు. కొంత‌మంది నేత‌లు సీఎం జ‌గ‌న్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక కొత్త‌గా కేబినేట్లో చోటు ద‌క్కించుకున్న మంత్రుల ముఖాలు వెలిగిపోయాయి. వాళ్ల ఆనందానికి అంతే లేదు. కానీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప‌రిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా మారింది. మంత్రి ప‌ద‌వి ద‌క్కింద‌నే సంతోషంగా కంటే కూడా ఇప్పుడు చుట్టుముట్టిన వివాదాలు ఆయ‌న‌కు ఊపిరి స‌లప‌కుండా చేస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అటు నెల్లూరు జిల్లా వైసీపీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంటే.. ఇటు ఆయ‌న నిందితుడిగా ఉన్న ఓ కేసులో సాక్ష్యాలు చోరీకి గురి కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

సొంత పార్టీ నుంచి వ్య‌తిరేక‌త‌..
మంత్రి వ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ నెల్లూరు జిల్లా వైసీపీలో అంత‌ర్గ‌త పోరుకు తెర‌లేపింద‌నే చెప్పాలి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మంత్రి ప‌ద‌వి పోవ‌డం.. స‌ర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి కేబినేట్లో చోటు ద‌క్క‌డంతో రాజ‌కీయాలు మారుతున్నాయి. కాకాణికి వ్య‌తిరేకంగా అనిల్ పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో శ్రీధ‌ర్‌రెడ్డితో అనిల్ భేటీ కావ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది. వీళ్లిద్ద‌రూ క‌లిసి కాకాణికి చెక్ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఎప్ప‌టి నుంచో కాకాణికి అనిల్‌, శ్రీధ‌ర్‌రెడ్డిల‌తో విభేదాలున్నాయి. ఇప్పుడు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో అవి తీవ్ర రూపం దాల్చే అవ‌కాశం ఉంది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాక తొలిసారి కాకాణి ఈ నెల 17న జిల్లాకు రానున్నారు. కానీ అదే రోజు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో అనిల్ కీల‌క స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది. దీంతో నెల్లూరులో వైసీపీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి అనిల్‌, శ్రీధ‌ర్‌రెడ్డితో పోరులో కాకాణి ఎలా నెట్టుకు వ‌స్తారో చూడాలి.

సాక్ష్యాల చోరీ..
నెల్లూరులోని 4వ అద‌న‌పు జ్యూడిషియ‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగ‌లు ప‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది. దేశ చరిత్ర‌లోనే ఇలా కోర్టులో దొంగ‌లు ప‌డ‌డం ఇదే తొలిసారి అనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ దొంగ‌లు మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న న‌కిలీ ప‌త్రాల కేసులో ఆధారాల‌ను దొంగిలించారు. దీంతో కాకాణి ఇదంతా చేయించార‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. శిక్ష ప‌డుతుంద‌నే భ‌యంతోనే ముందుగానే దొంగ‌ల‌తో సాక్ష్యాలు మాయం చేయించార‌ని మండిప‌డుతున్నారు. త‌మ కుటుంబానికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులున్న‌ట్లూ కాకాణి విలేక‌ర్ల స‌మావేశంలో ప‌త్రాలు చూపించ‌డంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి 2016లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అవ‌న్నీ న‌కిలీ ప‌త్రాల‌ను తేల్చిన పోలీసులు కేసు న‌మోదు చేసి ఏ1గా కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. కానీ సుప్రీం కోర్టు నుంచి ఆయ‌న బెయిల్ తెచ్చుకున్నారు. మ‌రో నెల‌లో ఈ కేసు విచార‌ణ‌కు రానున్న నేప‌థ్యంలో ఇప్పుడు సాక్ష్యాలు మాయం కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.