ఏపీ సీఎం జగన్ ఆగ్రహం కట్టలు తెగింది. విపక్ష టీడీపీ, జనసేన సహా ఒక వర్గం మీడియాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వీళ్లెవరూ నా వెంట్రుక కూడా పీకలేరు“ అని వ్యాఖ్యానించారు. “దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. ఎంతగా బురదచల్లినా ఎవరూ నన్నేమీ చేయలేరు. వెంట్రుక కూడా పీకలేరు” అని జగన్ అన్నారు. తాము సంక్షేమం కోసం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో జగనన్న వసతిదీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. “జగనన్న వసతి దీవెన” రెండో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమచేసిన అనంతరం నంద్యాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ సభలో.. ప్రతిపక్షాలతోపాటు మీడియాపైనా తీవ్ర పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఎవరెంతగా బురదచల్లినా తననేమీ చేయలేరని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి అన్నారు.
గతంలో మాదిరిగా అరకొరగా కాకుండా.. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్పారు. ‘ఒక కుటుంబంలో ఎంత మందిని చదివించినా మీకు తోడుగా నేను ఉంటా. తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల వారు కళాశాలలకు వెళ్తారు. కళాశాలల్లో వసతులు ఎలా ఉన్నాయో తల్లులు పరిశీలిస్తారు. దీంతో కాలేజీలకు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్రంలో అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది తల్లులకు మేలు జరుగుతోంది. కొత్తగా రాష్ట్రానికి 16 వైద్య కళాశాలలు వస్తున్నాయి’ అని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.
పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాలంలో తక్కువగా ఉన్నజీఈఆర్ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను.. పెంచిన ఘనతను తమ ప్రభుత్వానిదేనని, ఇది గమనించమని ప్రజలను కోరారు.
నాడు-నేడుతో బడుల రూపురేఖలను మారుస్తూ.. సర్కారీ బడులకు మంచి రోజులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. చేస్తున్న మంచేదీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియాకు పట్టట్లేదని, పార్లమెంట్ వేదికగా చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వాళ్లదన్నారు.
ఎక్కడైనా ప్రతిపక్షాలు అనేవి రాష్ట్రం పరువు కోసం ఆరాటపడతాయని.. కానీ, మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమైన ఏంటంటే.. ఇలాంటి ప్రతిపక్ష నేత.. ఆయన దత్త పుత్రుడు, ఎల్లో మీడియాలు ఉండటం.. పరువు తీయడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవేవీ తనను బెదిరించలేవని, ప్రజల దీవెనలతో ‘జగన్ అనే నేను’ ఈ స్థానంలోకి వచ్చానని గుర్తు చేశారాయన. దేవుడి దయతో మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. అయితే.. ఈ రేంజ్లో అసహనం వ్యక్తం చేయడం.. ఇటీవల కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates