ట్రంప్ కు ఎదురుగాలి.. ప్రత్యర్థి ముందంజ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరుగుతుున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి మరోసారి ఎన్నిక కావాలని ట్రంప్ కోరుతుంటే.. మరోసారి ఆయన చేతిలో పాలనా పగ్గాలు ఉంటే అగ్రరాజ్యానికి గడ్డుపరిస్థితే అన్న భావన వ్యక్తమవుతోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారికి ముందంతా ట్రంప్ జోరు సాగినా.. ఇప్పుడు మాత్రం లెక్కల్లో తేడా వస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం ట్రంప్ కు ప్రత్యర్థిగా బరిలో నిలిచారు డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్. తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే 12 పాయింట్ల అధిక్యతతో బైడెన్ ముందున్నారు. జూన్ 13 నుంచి పదహారువరకు ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ట్రంప్ ప్రత్యర్థి అధిక్యతను ప్రదర్శిస్తున్నారు.

సర్వేలో పాల్గొన్న అమెరికన్లలో అత్యధికులు.. జాత్యహంకారం.. నిరుద్యోగం.. కరోనా లాంటి సమస్యలు దేశ స్థిరత్వానికి ప్రధాన ముప్పుగా భావించే వారు ఎక్కువ అవుతున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది బైడెన్ కు మద్దతు పలకగా.. ట్రంప్ కు 38 శాతం మంది మాత్రమే ఓకే చెబుతున్నారు. గత నెలలో ఎనిమిది పాయింట్ల అధిక్యతను ప్రదర్శించిన బైడెన్.. ఇప్పుడుతన పరిస్థితిని మరింత మెరుగుపర్చుకుంటుంటే.. ట్రంప్ వెనుకబడిపోతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజాగా జరిగే ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారితో పాటు.. పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా దేశంలో నిరసనలు వెల్లువెత్తటం.. అత్యధికులు ట్రంప్ నకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు నెలల పాటు సాగితే.. ట్రంప్ కు దెబ్బ పడటం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.