ఢిల్లీలో రేవంత్ దూకుడు

తెలంగ‌ణ రాష్ట్ర కాంగ్రెస్ లో పీసీసీ ఛీఫ్‌ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ల పంచాయితీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. రేవంత్ పీసీసీగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఓ వర్గం నేతలు ఆయనతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.  గతంలోనూ రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. సీనియర్ నేత జగ్గారెడ్డి ఎపిసోడ్ తో అస్త్రం దొరికినట్టుగా భావించారు. ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమితో అక్కడ పీసీసీ చీఫ్ లను హైకమాండ్ తొలగించింది. ఇదే మంచి అనుకొని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హస్తిన వెళ్లారు.

ఇప్పుడు నేరుగా పార్టీ చీఫ్ ను కలిసి అన్ని విషయాలను వివరించాలని డిసైడయ్యారు. అయితే, వారికి ఢిల్లీలో ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని ప‌రిణామాల గురించి వివ‌రించ‌డం, పీసీసీ చీఫ్ రేవంత్ పై ఫిర్యాదు చేయడానికి హాస్తిన వెళ్లిన నేతలు అయోమయంలో పడ్డారని స‌మాచారం. దీనికి కార‌ణం పార్టీ చీఫ్ సోనియాగాంధీ అపాయింట్ మెంట్ దొరక్కపోవడం. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోనియాను కలిసే చాన్స్ ఉంటుందని సీనియర్లు భావించారు. మంగ‌ళ‌వారం  ఉదయం నుండి సాయంత్రం వరకు సోనియా అపాయింట్మెంట్ కోసం సీరియస్ గా ట్రై చేసినా దొరకలేదని సమాచారం. బుధ‌వారం సైతం అదే ప‌రిస్థితి ఎదురైంద‌ని తెలుస్తోంది. సోనియా అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులు ఉండాలో అర్ధం కావడం లేదని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర నేతలకు ఇప్పుడప్పుడే సోనియా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఒక్కరిద్దరు నేతలు ఇవాల్టి వరకు వెయిట్ చేసి వెనుదిరిగి వచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను కలిసిన రేవంత్ పార్టీలో జరుగుతున్న విషయాలు, లాయలిస్టుల పేరుతో సీనియర్ల సమావేశాలపై ఆయనకు రిపోర్ట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా ఢిల్లీలో రేవంత్ వ‌ర్సెస్ సీనియ‌ర్ల పంచాయ‌తీలో రేవంత్ పైచేయి సాధించిన‌ట్లు స‌మాచారం.