పెగాస‌స్‌పై వైసీపీ దూకుడేలా? తేడా వ‌స్తే దెబ్బే!

ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తే వెంట‌నే రంగంలోకి దిగి ప‌ట్టు సాధించాల‌ని అధికార పార్టీలు అనుకోవ‌డం రాజ‌కీయాల్లో సాధార‌ణ‌మే. ఇక ఏపీలో అయితే ప్రతిప‌క్ష టీడీపీని ఖాళీ చేయాల‌నే ల‌క్ష్యంతో ఉన్న వైసీపీ.. బాబును దెబ్బ కొట్టే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దులుకోద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే ఇప్పుడు పెగాస‌స్ వ్య‌వ‌హారంలో వైసీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఏపీలో టీడీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు పెగాస‌స్ స్పైవేర్ కొనుగోలు చేశార‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ చెప్పార‌నే అస్ప‌ష్ట ఆరోప‌ణ‌ల‌పై వైసీపీ ఆధార‌ప‌డుతోంది. దీని ఆధారంగానే బాబును టార్గెట్ చేసి అసెంబ్లీ స‌భా సంఘంతో విచార‌ణ చేయించేందుకు సిద్ధ‌మైంది.

దూకుడు మంచిదేనా?
మ‌మ‌తా బెన‌ర్జీ అస‌లు చంద్ర‌బాబును ఉద్దేశిస్తూ పెగాస‌స్ వ్య‌వ‌హారంపై ఏం చెప్పారో పూర్తి క్లారిటీ లేదు. టీడీపీ ప్ర‌భుత్వం దాన్ని కొనుగోలు చేసిందా? బాబు వ్య‌క్తిగ‌తంగా కొనుగోలు చేశారా? అనేదానిపై స్ప‌ష్ట‌త లేదు. అసలు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కానీ వ్య‌క్తుల‌కు కానీ దాన్ని కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుందా అనేది స్ప‌ష్టంగా తెలీదు. కానీ కేవ‌లం మ‌మ‌తా బెన‌ర్జీ అన్నార‌ని చెప్పి బాబును టార్గెట్ చేసి వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం క‌రెక్టేనా అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. ద‌ర్యాప్తు సంస్థ‌లైన ఏసీబీ, సీబీఐని వ‌దిలేసి అసెంబ్లీ స‌భా సంఘంతో విచార‌ణ చేయించేందుకు సిద్ధ‌మ‌వ‌డం కూడా సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ప్రాథ‌మిక ఆధారాలు లేకుండా క‌నీస స్ప‌ష్ట‌త లేకుండా వైసీపీ ఇలా దూకుడుగా వ్య‌వ‌హ‌రించడం ఆ పార్టీకే ప్ర‌మాదమ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఒక‌వేళ మాట మారిస్తే..
కేవ‌లం మ‌మ‌తా బెన‌ర్జీ వ్యాఖ్య‌ల ఆధారంగా వైసీపీ ప్ర‌భుత్వం ఇలాంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కానీ రేపో ఎల్లుండో మ‌మ‌త మాట మారిస్తే ఏం వైసీపీ ఏం చేస్తుంది? త‌న వ్యాఖ్య‌ల‌ను వక్రీక‌రించారోన‌నో లేదా త‌న మాట‌ల‌ను అపార్థం చేసుకున్నార‌ని అసలు తాను చంద్ర‌బాబు పేరే తీయ‌లేద‌ని మ‌మ‌త చెప్తే అప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఏమిట‌ని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. అప్పుడు వైసీపీ విమ‌ర్శ‌లు పాలు కావ‌డం ఖాయం. ఇక టీడీపీకి మంచి ఛాన్సు దొరుకుతుంది. ఒక‌వేళ ఇప్పుడు స‌భా సంఘం చంద్ర‌బాబు పెగాస‌స్ కొన్నార‌ని నిర్ధారిస్తే దానికి శాస్త్రీయ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది క‌దా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అవ‌కాశం దొరికింది క‌దా అని దూకుడుగా ముందుకు వెళ్తే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని చెబుతున్నారు. స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయించి వాస్త‌వాలు బ‌య‌ట‌పెడితేనే ప్ర‌భుత్వానికి మేల‌ని విశ్లేష‌కులు అంటున్నారు.