కేసీఆర్‌కే కాదు.. కాంగ్రెస్‌కు కూడా వ్యూహ‌క‌ర్త దొరికాడు

తెలంగాణ‌లో త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌లు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం.. రాజ‌కీయ ప‌క్షాలు వ్యూహ‌క‌ర్త‌ల‌ను పెట్టుకుంటున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ముందుస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ వ్యూహాల‌పై వ్యూహాలు వేసుకుంటున్నాయి. అయితే.. పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాలను వ్యూహకర్తలే నిర్ణయించబో తున్నారు. ‘బీజేపీ ముఫ్త్ భారత్‌’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోడీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నే రాష్ట్రంలో రాజకీయవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే టీఆర్ఎస్‌కు వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్ రంగంలోకి దిగారు.  ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఎవరు ప్రత్యామ్నాయం అనే అంశంపై ఆయ‌న దృష్టి పెట్టారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నాయి. బీజేపీ నేతలు తమకు వ్యూహకర్తల అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, టీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న అవినీతి త‌మ‌కు ప్ర‌ధాన అస్త్రాల‌ని.. ప్ర‌చారం చేసుకుంటున్నారు.

మ‌రోవైపు టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. 40 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదుతో పాటు వ్యూహకర్తల వ్యూహాలు ఉంటే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఇందులోభాగంగా ప్రశాంత్ కిషోర్ అనుచరుడైన సునీల్ కనుగోలు(ఎస్కే) సేవలను ఉయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సునీల్‌కు ఏపీతో అనుబంధం ఉంది. ఆయన విజయవాడ లో జన్మించారు. ప్రస్తుతం సునీల్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఇప్పటికే సునీల్ అనేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించి నట్లు తెలుస్తోంది.

ఆయనకు నేతలను విజయతీరాలకు చేర్చిన చరిత్ర కూడా ఉందని చెబుతున్నారు. అందువల్ల ఎస్కేను కాంగ్రెస్ వ్యూహకర్తగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మాదిరిగా వ్యూహకర్తల మీదగా ఆధారపడకుండా తన కార్యకర్తలనే బీజేపీ నమ్ముకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పర్యటిస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభా నియోజకవర్గాల వారీగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

ఆ పార్టీ నేత బండి సంజయ్ రెండోవిడత పాదయాత్రతో పాటు సభలు సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కేసీఆర్ ఎన్నికలకు వెళ్తార‌ని బీజేపీ అంచనా వేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారమే లక్ష్యంగా కమలనాథులు బరిలోకి దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ్యూహ‌క‌ర్త‌లు ఏవిధంగా ఆయా పార్టీల‌ను గ‌ట్టెక్కిస్తారేది ఆస‌క్తిగా మారింది.