వంగ‌వీటి సైన్యం ఏక‌మైతే.. ఎవ‌రికైనా చుక్క‌లే

కాపు నాయ‌కుడు, పేద‌ల ఆత్మీయ బంధువు దివంగ‌త వంగ‌వీటి రంగా  మోహ‌న్ రంగా స్మృత్య‌ర్థం.. విజ‌య‌వాడ‌లోని శ్రీన‌గ‌ర్ కాల‌నీలో రంగా కాంస్య విగ్రహాన్ని రంగా, రాధా మిత్ర‌మండ‌లి అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ కాంస్య విగ్ర‌హాన్ని రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న రాధాకృష్న‌.. ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వంగ‌వీటి రంగా సైన్యం.. త‌లుచుకుంటే.. ప్ర‌భుత్వం కూలిపోవ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. వంగ‌వీటి సైన్యాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్ద‌ని .. ప‌రోక్షంగా ఆయ‌న వైసీపీని హెచ్చ‌రించారు.

వంగవీటి రంగా ఒక్క జిల్లాకే పరిమితం కాదని.. ఆయన్ను ఏపీ మొత్తం ఆరాధిస్తుందని  వంగవీటి రాధా అన్నారు.  రంగా కాంస్య విగ్రహాన్ని రాధా ఆవిష్కరించిన ఈ కార్య‌క్ర‌మానికి ముందు.. భారీ ర్యాలీతో, బాణా సంచాతో అభిమానులు రాధాకు ఘ‌న‌ స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఏ పదవి, హోదా ఇవ్వని గౌరవం తనకు ‘రంగా గారి అబ్బాయి’గా దక్కిందని రాధా అన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను ఏ పార్టీ కూడా ఆశించిన విధంగా వాడుకోలేద‌ని.. క‌నీస గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేదనే ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తన తండ్రిని కులమతాలకు అతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఏపీ నలుమూలలా ఆయన పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రంగా అంటే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెన్నిధని అన్నారు. రంగా అభిమానులు అంతా ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న రంగా శిష్యులు, అభిమానులు విజయవాడ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టేలా కృషి చేయాలని కోరారు.

పదవులు ఐదేళ్లకు మారిపోవచ్చని, రంగా కుమారుడిగా ప్రజలు చూపించే అభిమానం అనంతమని స్పష్టంచేశారు. ఈ జన్మకు రంగా కొడుకు అనే ఆదరణే తనకు సంతృప్తినిస్తుందన్నారు. ఏపీలోని విజయవాడ శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు.