భూమా అఖిలపై ఛార్జిషీటు

తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియపై తెలంగాణా పోలీసులు ఛార్జిషీటు వేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వందల కోట్ల రూపాయల విలువైన భూమి సొంతదారులను కిడ్నాప్ చేసేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి తదితరులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం అప్పట్లో సంచలనమైంది. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులుగా వేషాలు వేసుకుని భూమి ఓనర్లు ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావు ఇంట్లోకి ప్రవేశించారు.

సోదరులు ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అయితే వీళ్ళ వాలకంపై అనుమానం వచ్చిన సోదరులు వెంటనే పోలీసులు కంట్రోల్ రూం 100కి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు చేసేదేమీలేక సోదరులను అప్పా జంక్షన్ దగ్గర వదిలేసి పారిపోయారు. ఇదే విషయమై తర్వాత దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేసి కోర్టులో పెట్టి రిమాండ్ కు పంపారు.

ఆ తర్వాత చాలా రోజులు భర్త, తమ్ముడు పరారీలోనే ఉన్నారు. చివరకు ముందస్తు బెయిల్ తెచ్చుకుని కోర్టులో లొంగిపోయారు. ఆ కేసులోనే పోలీసులు తాజాగా అఖిల, భార్గవ్, జగద్విఖ్యాత్ తో పాటు మరో 34 మందిపైన చార్జిషీటు వేయటం ఇంట్రెస్టింగ్ గా మారింది. చార్జిషీటును పరిశీలించిన తర్వాత పోలీసులకు కోర్టు అవసరమైన అనుమతులు ఇస్తుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఒకసారి కోర్టు కనుక అనుమతిస్తే మళ్ళీ అఖిల అండ్ కో ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఖాయం.

ఈసారి భార్గవ్, జగద్విఖ్యాత్ తప్పించుకునే అవకాశాలు లేవు. మొత్తానికి కిడ్నాపులు, హత్య కుట్రలకు, దాడులకు, ఫోర్జరీ సంతకాలకు అఖిల ఫ్యామిలీ ఫుల్లు బిజీగా ఉంది. చాలా కాలం తర్వాత అఖిల తన నియోజకవర్గం ఆళ్ళగడ్డకు వెళ్ళి వైసీపీ ఎంఎల్ఏ అవినీతిపై చాలెంజ్ చేసి కాస్త హడావిడి చేశారు. అమావాస్యకో పౌర్ణమికో నియోజకవర్గంలో ప్రత్యక్షమవడం, మిగిలిన మద్దతుదారులతో సమావేశం పెట్టడం, ప్రత్యర్ధులకు వార్నింగులివ్వటంతోనే సరిపోతోంది అఖిలకు. దాడి కేసులో ఇప్పుడు కూడా ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలోనే ఉన్నాడు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి అఖిల పెద్ద తలనొప్పిగా మారింది అన్నది వాస్తవం