కాంగ్రెస్ కు షాక్.. ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి గుడ్ బై?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని.. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడిస్తారని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 12 గంటల వేళలో ఆయన రాజీనామా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.

తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్న విషయాన్ని విపులంగా వెల్లడిస్తూ.. ఒక లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లుగా చెబుతున్నారు. మరి.. కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పిన తర్వాత జగ్గారెడ్డి రాజకీయ అడుగులు ఎలా పడనున్నాయి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూడు ఆప్షన్లకు అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత మరే పార్టీలో చేరే ఆలోచన లేదని.. స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

అదేమీ కాదు.. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేది పక్కా అని మరికొందరు చెబుతుంటే.. ఈ రెండు కాదు.. ఆయన సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా మూడు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకూ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి కారణం.. టీపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డితో పడకపోవటమేనని చెప్పాలి. ఆయన్ను కాంగ్రెస్ చీఫ్ గా నియమించటంపై జగ్గారెడ్డి మొదట్నించి గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంపై పూర్తి విధేయత ప్రదర్శించే జగ్గారెడ్డి.. రేవంత్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన మైండ్ సెట్ తో ఉన్నారని చెప్పాలి. మీడియా చిట్ చాట్ లోనూ.. పత్రికా ముఖంగా రేవంత్ ను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసే వారు.

రేవంత్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న విమర్శల్ని ఆయన సంధించేవారు. పార్టీ ఇమేజ్ కంటే కూడా వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటానికే రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని.. తమకు సమాచారం ఇవ్వకుండానే తమ నియోజకవర్గాల్లో ప్రోగ్రాంలను ప్రకటిస్తున్నారంటూ ఆక్షేపిస్తూ ఇటీవల అధినాయకత్వానికి లేఖ రాయటం తెలిసిందే. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. టీపీసీసీ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని.. ఆయన్ను మార్చాలన్న డిమాండ్ తో అధిష్ఠానానికి రాసిన లేఖ మీడియాలో లీక్ కావటం తెలిసిందే. ఇది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వివరణ కోరతామని టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చీఫ్ చిన్నారెడ్డి వెల్లడించటం తెలిసిందే. దీనిపై జగ్గారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా.. తనను రేవంత్ ఆర్మీ సోషల్ మీడియాలో కోవర్టు అంటూ ప్రచారం చేస్తున్నారంటూ జగ్గారెడ్డి ఆరోపిస్తూ.. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. తన అనుచరుల వద్ద ఆవేదన పడినట్లుగా తెలుస్తోంది. కోట్లు ఖర్చు చేసి గెలిచి.. ఇలా కోవర్టునన్న ముద్ర వేయించుకోవాల్సిన అవసరం ఏమిటని..పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా ఉండాలన్న మాట వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతారన్న విషయం తమకు రెండు నెలలకు ముందే తెలుసని రేవంత్ వర్గం చెబుతోంది. ఇందుకు తగ్గట్లు తమ వద్ద స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. రేవంత్ ను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు ఫలించని నేపథ్యంలో జగ్గారెడ్డి తన సొంతదారిలో పయనిస్తున్నట్లుగా చెబుతున్నారు. పార్టీకి రాజీనామా చేసినా.. ఎమ్మెల్యే పదవిలో మాత్రం కొనసాగుతారన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ.. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే.. జగ్గారెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర స్పీకర్ కు కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పిటీషన్ ను పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకునే వీలుందని చెబుతున్నారు.