టీఆర్ఎస్ ప్రచారం: తెలంగాణా-ఏపీ కలిసిపోతాయా?

ఇపుడిదే అంశంపై జనాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే కొద్దిరోజులుగా కేసీయార్, మంత్రులు హరీష్ రావు, కేటీయార్ ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. మళ్ళీ బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తే తెలంగాణా, ఏపీని కలిపేస్తారంటు గోల పెడుతున్నారు. మొదటి కేసీయార్ ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. తర్వాత హరీష్ రావు ఇదే నిజమంటు ఒక బహిరంగ సభలో చెప్పారు. తాజాగా నిజామాబాద్ పర్యటనలో కేటీయార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 

అంటే వీళ్ళ భయం లేదా ఆందోళన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణా సెంటిమెంటును రాజేసి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్లే ఉంది. కేసీయార్ పాలనపైన జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే సరైన ప్రత్యామ్నాయం లేని కారణంగానే జనాలు వేరే దారి లేక టీఆర్ఎస్ కు ఓట్లేస్తున్నారు. ప్రతిపక్షాల్లో ఏదైనా బలంగా ఉంటే జనాలు కచ్చితంగా దానికే ఆదరిస్తారని ఇప్పటికే మూడు సందర్భాల్లో నిరూపణైంది. 

మొదటి దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలోను తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలోను బీజేపీ ఇలాగే మంచి ఫలితం రాబట్టింది. దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఓడించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీయార్ కు చెమటలు పట్టించింది. తర్వాత నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోయినా ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటి తో బీజేపీ గెలిచింది. 

దీనిబట్టి అర్ధమవుతున్నదేమంటే గట్టి ప్రతిపక్షం ఉన్నచోట కేసీయార్ పప్పులుడకటం లేదని. కేసీయార్ అండ్ కో భయపడుతున్నట్లుగా మళ్ళీ తెలంగాణా  ఏపీ కలిసిపోతాయో లేదో ఎవరికీ తెలీదు. విభజన అయితే అడ్డుగోలుగా జరిగిందని మాత్రం ప్రతి ఒక్కరికీ తెలుసు. పూర్తిగా ఏపీకి అన్యాయం చేసి మరీ రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం విడగొట్టింది. అయితే జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి మరింత అన్యాయం చేస్తోంది. 

ఒకవైపు అన్యాయం చేస్తునే మరోవైపు పార్లమెంటులో అడ్డుగోలు విభజన జరిగిందని, ఏపీకి తీరని అన్యాయం జరిగిందని నరేంద్ర మోడీ, అమిత్ షా మొసలి కన్నీరు కారుస్తుండటమే విచిత్రంగా ఉంది. పదే పదే పార్లమెంటులో ఇదే ప్రస్తావన తెస్తుండటమే వీళ్ళ అనుమానాలకు కారణమవుతోంది.మరో వైపు రేవంత్ రెడ్డి వీరిద్దరు రాజకీయ తోడు దొంగలు. ఒకరికి ఒకరు అవకాశాలు కల్పించుకుని మరీ వార్తల్లో ఉండటానికే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.