కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారే!

రాజ‌కీయ చ‌ణక్యుడిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పేరుంది.  ఆయ‌న వ్యూహాలు, ప్ర‌ణాళిక‌లు ఆ స్థాయిలో ఉంటాయి మ‌రి. ఆయ‌న ఏం చేసినా అందులో క‌చ్చితంగా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై ప్ర‌ధాని మోడీపై యుద్ధం చేస్తున్నారు. ఏదేమైనా స‌రే త‌గ్గేదేలే అంటూ తీవ్ర వ్యాఖ్య‌ల‌తో కేంద్రంపై విరుచుకుప‌డుతున్నారు. తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే ఇలా కేంద్రంపై కేసీఆర్ చెల‌రేగ‌డం వెన‌కే పెద్ద స్కెచ్ ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రెండు ర‌కాలుగా..
రెండు ర‌కాలుగా ప్ర‌యోజనం పొంద‌డం కోసం కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై కేసీఆర్ పోరు బాట‌లో సాగుతున్నార‌ని నిపుణులు అంటున్నారు. అందులో ఒక‌టి.. తెలంగాణ‌లో మూడోసారి టీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవ‌డం. మ‌రొక‌టి.. దేశ రాజకీయాల్లో కీల‌కంగా మార‌డం. ఈ రెండు విష‌యాల్లోనే విజ‌య‌వంతం కావ‌డానికి కేసీఆర్‌కు క‌నిపించిన మార్గం.. మోడీని టార్గెట్ చేయ‌డం. దీంతో తాను అనుకున్న రెండు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దూకుడుగా ముందుకు సాగుతున్నారు.

రెండుసార్లు తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నుంచి స‌వాలు ఎదుర‌వుతోంది. ముఖ్యంగా బీజేపీ బ‌లోపేత‌మ‌వ‌డం కేసీఆర్‌కు ఇబ్బందిగా మారింది. అందుకే ఆ పార్టీని టార్గెట్ చేసి మ‌రోసారి సెంటిమెంట్‌ను ర‌గిల్చి ఎన్నిక‌లకు వెళ్లాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఆయ‌న కోరుకున్న‌ట్లుగానే బీజేపీ కూడా ఆ ట్రాప్‌లో ప‌డుతున్న‌ట్లే క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పార్లమెంట్‌లో ఏపీ విభ‌జ‌న అన్యాయంగా జ‌రిగింద‌నే వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టుకున్న టీఆర్ఎస్ వాటిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్తోంది.

ఎప్ప‌టి నుంచో..
మ‌రోవైపు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని కేసీఆర్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. రెండోసారి రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న ఆ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో.. కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర మూడో కూట‌మికి రంగం సిద్ధం చేయాల‌ని చూశారు. రాష్ట్రంలో త‌న త‌న‌యుడు కేటీఆర్‌ను సీఎం చేసి.. ఆయ‌న ఢిల్లీకి వెళ్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ మ‌ధ్య‌లో కేసీఆర్ కాస్త సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు బీజేపీపై ఎదురు దాడి చేయ‌డం కోసం మ‌రోసారి ఢిల్లీపై క‌న్నేశారు. ఢిల్లీ కోట‌ను బ‌ద్ద‌లు కొడ‌తాన‌ని.. ప్ర‌జ‌లు ఆద‌రిస్తే మోడీని దేశం నుంచి త‌రిమేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే దేశంలో మోడీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి మోడీ ప్ర‌భ ఏ మేర‌కు మిగిలి ఉందో తేల‌నుంది. మ‌రోవైపు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా మూడో కూట‌మిగా ఏర్పాటు దిశ‌గా సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ కూడా జాతీయ రాజ‌కీయాల‌పై మ‌రోసారి దృష్టి పెట్టార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మోడీని విమ‌ర్శిస్తే జాతీయ వ్యాప్తంగా హైప్ వ‌చ్చే అవకాశం ఉంద‌ని భావించే కేసీఆర్ ఈ రూట్ ఎంచుకున్నార‌ని చెబుతున్నారు.