జ‌గ‌న్ పై కొత్త డౌట్లు పుట్టిస్తున్న చంద్ర‌బాబు

ఏపీలో ఇప్పుడు రాజ‌కీయాలు ఎంత హాట్ హాట్‌గా మారిపోయాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. రాజ‌కీయ నాయ‌కుల విమ‌ర్శ‌లు – ప్రతి విమ‌ర్శ‌ల‌కు తోడుగా ఉద్యోగుల ఆందోళ‌న‌లు ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచేశాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏ అంశంలో అయితే, త‌ను బ‌ల‌ప‌డాల‌ని ఏపీ సీఎం భావిస్తున్నారో అదే అంశంలో ఆయ‌న్ను టార్గెట్ చేశారు. ఇదంతా కొత్త జిల్లాల ఏర్పాటు, ఆ జిల్లాల‌కు పేరు పెట్ట‌డం గురించి.

ఎన్నిక‌ల హామీ మేర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త జిల్లా ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈమేర‌కు జిల్లాల‌కు పేర్లు సైతం పెట్టేశారు. అయితే, ఈ విష‌యంలో ర‌క‌ర‌కాల డిమాండ్లు , ప్ర‌తిపాద‌న‌లు, విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ఒర‌వ‌డిలోనే తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు కొత్త డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల్లో  ఒక్క జిల్లాకు కూడా రాజ్యాంగ పితామ‌హుడు అంబేద్క‌ర్ పేరు ఎందుకు పెట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు.

ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగిస్తూ అంబేద్క‌ర్ పేరును ఖ‌రారు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు.

తెలుగు జాతి గ‌ర్వప‌డే ద‌ళిత బిడ్డ బాల‌యోగి పేరును తొల‌గించ‌డం వైసీపీ సర్కారు కుసంస్కారానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. జగన్ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కాగా, చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు త‌మ పార్టీ నాయ‌కుని ప‌ట్ల జ‌గ‌న్‌ స‌ర్కారు తీరును నిల‌దీస్తూనే అదే రీతిలో అంబేద్క‌ర్ విష‌యంలో ఏపీ స‌ర్కారు నిజ‌మైన చిత్త‌శుద్ధిని ప్ర‌శ్నించేలా ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.