ఉద్యోగుల‌కు హైకోర్టులో ఊర‌ట‌.. జీతం త‌గ్గించొద్ద‌న్న కోర్టు

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన పీఆర్‌సీతో త‌మ‌కు న‌ష్టం వ‌స్తుంద‌ని.. త‌మ జీతాలు త‌గ్గుతాయ‌ని… ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందించింది. ఉద్యోగుల వేత‌నాల‌ను త‌గ్గించ‌వ‌ద్ద‌ని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వెయ్యాలని ప్రభుత్వానికి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. పీఆర్సీపై నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదని న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీవోల్లో ఎరియర్స్ కట్ చేయటాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా… ఈ వ్యవహారంలో అనేక అంశాలు ముడిపడి ఉండటంతో ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. పీఆర్సీలో జీతాలు తగ్గాయని హైకోర్టులో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, మంత్రుల కమిటీ ముందు కేవలం నాలుగు జేఏసీల అధ్యక్షులు మాట్లాడాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. గతంలో పెట్టిన మూడు ప్రతిపాదనలను మరోమారు మంత్రుల కమిటీ ముందు ఉంచాలని నిర్ణయించారు. ఇతర ఆర్థికపరమైన ప్రతిపాదనలు పెడితే మరోసారి స్టీరింగ్ కమిటీలో చర్చించనున్నట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల రిలే దీక్షలకు స్టీరింగ్ కమిటీ సంఘీభావం తెలిపింది. తాజాగా ప్ర‌భుత్వం నుంచి ఉద్యోగ సంఘాల‌కు ఆహ్వానం అందింది. చ‌ర్చ‌ల‌కు రావాల‌ని.. కూర్చుని తేల్చుకుందామ‌ని.. ఆహ్వానం పంపారు.