కిరాణా షాపుల్లో లిక్క‌ర్.. పైగా రైతుల‌కోసమేనట

మ‌ద్యం ప్రియుల‌కు.. ఆ రాష్ట్రం మ‌జాకైన వార్త అందించింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైన్ షాపులు, బార్ల‌కు మాత్ర మే ప‌రిమిత‌మైన మ‌ద్యం అమ్మ‌కాల‌ను ఇక నుంచి కిరాణా షాపుల్లోనూ అనుమ‌తిస్తూ.. స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. ఇది మ‌న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.. పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర‌లో!! అస‌లు ఏం జ‌రిగిందంటే..

మహారాష్ట్రలోని మ‌ద్యం వినియోగదారులు కిరాణా దుకాణాలు మరియు సూపర్ మార్కెట్లలో వైన్ కొనుగోలు చేయగలుగుతారని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.  ‘షెల్ఫ్ ఇన్ షాప్’ విధానాన్ని స‌ర్కారు తాజాగా ఆమోదించింది, 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న సూపర్ మార్కెట్‌లు, కిరాణా దుకాణాలలో వైన్ అమ్మకాలకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రత్యేక మద్యం దుకాణాల ద్వారానే వైన్ విక్రయాలను అనుమతిస్తున్నారు. ఈ విధానం గత 20 ఏళ్లుగా రాష్ట్రంలో అమల్లో ఉంది. అయితే ఈ విధానం ల్యాప్స్ కావడంతో ప్రభుత్వం సవరించిన  కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

రాష్ట్రంలోని వ్యవసాయోత్పత్తులకు, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. “పండ్ల నుండి వైన్ తయారు చేయడం వల్ల రైతులకు అధిక ధరలు లభిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇది గమనించబడింది. అందుకోసం రాష్ట్రంలోని సూపర్ మార్కెట్లు లేదా కిరాణా షాపుల్లో వైన్ విక్రయాలు ప్రారంభించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో వైన్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది“ అని మాలిక్  అన్నారు.

కొత్త విధానంపై ప్ర‌తిప‌క్షం బీజేపీ వ్యతిరేకత గురించి అడిగినప్పుడు, మాలిక్ మాట్లాడుతూ, “బీజేపీ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ మరియు గోవాలో ఇలాంటి విధానాలు అమలులో ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే నైతిక హక్కు బీజేపీకి లేదు“ అని ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నారు. ఏదేమైనా.. ఇక నుంచి కిరాణా దుకాణాల్లోనూ.. మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.