కాంగ్రెస్ లో ‘పద్మ’ చిచ్చు

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పద్మ పురస్కారాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లే ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత, జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ కు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. ఈయనతో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కు కూడా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించింది.

కల్యాణ్ సింగ్ ఎలాగూ బీజేపీ నేత, పైగా జీవించి లేరు కాబట్టి సమస్యే లేదు. బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ పురస్కారాన్ని తిరస్కరించారు. ఇక గులాం మాత్రమే ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ పరిస్ధితుల్లో గులాం వాలకం చూస్తే పురస్కారాన్ని అందుకుంటారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

సరిగ్గా ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో స్పందనలు మొదలయ్యాయి. పురస్కారానికి ఎంపికైనందుకు శశిధరూర్ లాంటి కొందరు నేతలు గులాంను అభినందించారు. అలాగే జై రామ్ రమేష్ లాంటి నేతలు ఎగతాళి చేస్తున్నారు. పురస్కారాన్ని తిరస్కరించటం ద్వారా బుద్ధదేవ్ లాంటి వాళ్ళు ఆజాద్ (స్వతంత్రం)గా ఉండాలని కోరుకుంటున్నారు. మరి మీరేమని అనుకుంటున్నారు గులాంజీ (బానిస లేదా అణిగిమణిగి ఉండటం) అంటు గులాంను ఎద్దేవా చేస్తున్నారు.

కేంద్రం ప్రకటించిన పురస్కారాలపై జనాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తున్నది. ఫక్తు రాజకీయనేతలను కూడా పురస్కారాలకు ఎంపిక చేయటం ఏమిటంటు జనాలు మండిపోతున్నారు. సుదీర్ఘ రాజకీయజీవితంలో వాళ్ళు సమాజానికి చేసిన సేవలేమిటో చెప్పాలని నిలదీస్తున్నారు. కేంద్రం పురస్కారాలను ప్రకటించిన రాజనీయ నేతలు తమ పార్టీ విధానాలకే కట్టుబడున్నారు. అంతేకానీ ప్రత్యేకించి సమాజం కోసం చేసిందేమీ లేదంటున్నారు. మరీ పరిస్దితుల్లో గులాం కు పురస్కారంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.