ప్ర‌మాణం చేస్తేనే కాంగ్రెస్ టికెట్‌

 ‘జంప్ జిలానీ’ల భయంతో గోవా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. గత అయిదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులతో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ… వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో బరిలో నిలవనున్న అభ్యర్థులతో ప్రమాణం చేయించింది. తాము గెలిస్తే పార్టీ మారమని భగవంతునిపై ఒట్టు వేయించింది. అంతేకాదు.. ఇలా ఒట్టు పెట్టిన వారికి మాత్ర‌మే టికెట్ ఇస్తామ‌ని.. ముందుగానే సందేశాలు పంపించింది. దీనికి సిద్ధ‌మైన వారికి మాత్ర‌మే టికెట్ ఇస్తామ‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రి సిఫార‌సులు అవ‌స‌రంలేద‌ని.. గోవా కాంగ్రెస్ పేర్కొంది. దీంతో నాయ‌కులు ఒప్పుడు ప్ర‌మాణాల బాట ప‌ట్టారు.

ఒట్టు పార్టీ మారం.. అంటూ.. ప్ర‌మాణం చేసేందుకు సిద్ధ‌ప‌డిన వారికి మాత్ర‌మే టికెట్లు ఇచ్చిన గోవా కాంగ్రెస్‌.. ఇందుకోసం ఎన్నికల బరిలోకి దిగనున్న మొత్తం 34 మంది అభ్యర్థులను ప్రత్యేక బస్ లో రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు, చర్చ్లకు, దర్గాలకు (అభ్య‌ర్థుల సంప్ర‌దాయాను సారం) తీసుకుని వెళ్లి.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడమని దేవుని ఎదుట ప్రమాణం చేయించారు కాంగ్రెస్ పెద్దలు.

కాంగ్రెస్ నుంచి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న సీనియర్ నాయకుడు చిదంబరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాస్త‌వానికి గ‌త 2017 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేయాలి. కానీ, రెండు సీట్లు మాత్ర‌మే త‌గ్గాయి. ఇంత‌లో బీజేపీ అరంగేట్రం చేసి.. కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను త‌న‌వైపు మ‌ళ్లించుకుంది. దీంతో ద‌క్కాల్సిన అధికారం కాంగ్రెస్‌కు దూర‌మైంది. దీంతో ఇప్పుడు అభ్య‌ర్థుల‌పై న‌మ్మ‌కం లేక‌నో.. లేక‌.. ఇలా అయినా.. క‌ట్టుబ‌డి ఉంటారనో.. కాంగ్రెస్ ఇప్పుడు ఒట్టు రాజ‌కీయాల‌కు తెర‌దీసింది. అయితే..దీనిపై కాంగ్రెస్ మ‌రో వాద‌న వినిపిస్తోంది.

అభ్యర్థులతో ప్రమాణం చేయించడంపై  ప్రజల మనసుల్లో నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఇలా దేవుని ముందు ప్రమాణం చేయించినట్లు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ చెప్పారు. గోవాలో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అత్యధికంగా 17 సీట్లలో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఒక్కొక్కరు పార్టీని వీడగా.. ప్రస్తుతం వారి సంఖ్య ఇద్దరికి పరిమితం అయ్యింది. 2019లో ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరారు.