క‌న్నా వాయిస్ అందుకే క‌ట్ అయ్యిందా ?

రాష్ట్ర బీజేపీలో చుక్కానిగా క‌నిపిస్తున్న  పార్టీ నేత‌ల‌కు అంతో ఇంతో.. భ‌రోసాగా ఉన్న మాజీ మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్య‌క్షుడు.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అభాసుపాల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న ఇమేజ్‌కు ఎలాంటి ఢోకాలేకుండా ముందుకు సాగారు. రాజకీయంగానే ఆయ‌న‌పై విమ‌ర్వ‌లు ఉన్నాయి.. త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను ఎవ‌రూ వేలెత్తి చూపించే ప‌రిస్థితి లేదు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష పార్టీగా.. ఆ పార్టీ నేత‌గా.. త‌ర‌చుగా ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కూడా గుప్పిస్తున్నారు.

దీంతో రాబోయే రోజుల్లో ఆయ‌న ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న నెంబ‌ర్ 2 నాయ‌కుడిగా పార్టీలోనూ ఆయ‌న స్థానం సంపాయిస్తార‌ని భావించారు. అయితే.. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ. ఇప్పుడు క‌న్నా.. తీవ్ర ఇక్క‌ట్ల‌లో మునిగిపోయారు. కుటుంబ సంబంధ‌మైన చిక్కులు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. త‌న ఇంటి కోడ‌లి విష‌యంలో గృహ హింస చ‌ట్టం కింద ఆయ‌న కుటుంబాన్ని కోర్టు దోషిగా తేల్చింది. కోటి రూపాయ‌ల జ‌రిమానా విధించింది. అంతేకాదు.. కోడ‌లికి రూ.50 వేల చొప్పున నెల నెలా.. ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.

గ‌తంలో యూపీలోనూ ఇలాంటి కేసు వెలుగు చూసింది. అక్క‌డ ఎమ్మెల్యే కుటుంబంలో కోడలికి గృహ హింస చ‌ట్టం కింద ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఎమ్మెల్యే కుటుంబానికి రూ.50 ల‌క్ష‌ల ఫైన్ విదించిన కోర్టు కోడ‌లికి రూ.25 వేల చొప్పున‌.. రుసుము ఇవ్వాల‌ని.. ఆదేశించింది. ఈ ప‌రిణామం.. అక్క‌డి బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసింది. సొంత ఇంట్లో మ‌హిళ‌ల‌ను ఆద‌రించ‌డం చేత‌కాని వాళ్లు.. ప్ర‌జ‌ల‌ను ఏం ఆద‌రిస్తారంటూ.. ప్ర‌తిప‌క్షాలు దుయ్య‌బ‌ట్టాయి. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యేను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.
త‌ర్వాత‌.. కొన్నాళ్ల‌కు ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకున్నారు.

అయితే.. స‌ద‌రు ఎమ్మెల్యేకు వాయిస్ లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్క‌డ ఇంత ప‌రిణామం జ‌ర‌గ‌పోయినా.. క‌న్నా… మీడియా ముందుకు వ‌చ్చి.. మ‌హిళ‌ల గురించి మాట్లాడే అవ‌కాశం కోల్పోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న ఏం మాట్లాడినా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అంటే.. ఒక ర‌కంగా. ఫైర్ బ్రాండ్ గా ఉన్న కన్నా.. వాయిస్ క‌ట్ అయిపోయింద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.