వైసీపీ ఎంపీకి షాకిచ్చిన సైబర్ చీటర్

మాయమాటలు చెప్పి డబ్బులు దోచేసే వాళ్లు ఈ మధ్యన ఎక్కువయ్యారు. ఆశ వల విసరడం… అందులోకి తేలిగ్గా చిక్కుకుపోయే వారు సామాన్యులే కాదు ప్రముఖులు ఉంటున్నారు. ఈజీగా వచ్చే డబ్బుల మీద ఉండే ఆశే దీనంతటికి కారణం. ఇలాంటి సైబర్ చోరులు ప్రముఖుల్ని టార్గెట్ చేసి.. భారీ మొత్తాలకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నమే ఒకటి వైసీపీ ఎంపీకి ఎదురైంది. అయితే.. ఆయన అప్రమత్తంగా ఉండటంతో సైబర్ దొంగ చేతిలో నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

అసలేం జరిగిందటే.. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తికి సైబర్ దొంగ ఒకడు ఫోన్ చేశారు. తాను సీఎంవో నుంచి మాట్లాడుతున్నానని.. తన పేరును అభిషేక్ గా పరిచయం చేసుకున్నారు. ఖాదీ పరిశ్రమ సబ్సిడీ రుణాల కింద ఆయనకు రూ.5కోట్లు మంజూరు అయినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆ రుణాన్ని పొందాలంటే మాత్రం తమ అకౌంట్ లో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు.

మొత్తం పాతిక అప్లికేషన్లకు రుణం మంజూరైందని.. ఒక్కో అప్లికేషన్ కు రూ.1.5 లక్షల చొప్పున తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పారు. సీఎంవో పేరు చెప్పటం.. మాట్లాడిన వ్యక్తి అనుమానాస్పదంగా లేకపోవటం వరకు బాగానే ఉన్నా.. ఒక్కో అప్లికేషన్ కు రూ.1.5 లక్షల చొప్పున చెల్లించాలని.. బ్యాంకు ఖాతాలో వేయాలని కోరటంతో ఎంపీ గురుమూర్తికి సందేహం వచ్చింది.

వెంటనే ఆయన సీఎంవో కార్యాలయానికి ఫోన్ చేసి.. అభిషేక్ పేరు మీద ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. ఆ పేరు మీద ఎవరూ లేరని.. అలాంటి రుణమేమీ లేదని చెప్పటంతో.. తనకు ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తి సైబర్ దొంగగా ఎంపీ గుర్తించారు. వెంటనే.. ఈ అంశంపై తిరుపతి అర్బన్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. మొయిల్ ద్వారా తనకు పంపిన వివరాల్ని పోలీసులకు అందించారు. సీఎంవో పేరుతో ఎంపీకే టోకరా కొట్టబోయిన అభిషేక్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా మోసగాళ్లు ఈ మధ్యన ఎక్కువ అయ్యారని.. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులతో పాటు.. తాజాగా ఎదురైన అనుభవాన్ని ఎదుర్కొన్న ఎంపీ గురుమూర్తి ప్రజలకు చెబుతున్నారు. బీకేర్ ఫుల్.