మోడీ పంజాబ్ టూర్ భ‌గ్నం.. మరో కుట్ర‌?

పంజాబ్లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాల కార‌ణంగా.. ఆయ‌న ప‌ర్య‌ట‌న నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. ఇది దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు దారితీసింది. ఇక‌, ఇప్పుడు ఈ అంశంపై జరుగుతున్న దర్యాప్తు కీల‌క మ‌లుపు తిరిగింది. మోడీ ప‌ర్య‌ట‌న‌ను భ‌గ్నం చేయ‌డం వెనుక‌.. వేర్పాటు వాద‌.. సిక్కు సంస్థ ఖ‌లిస్థానీ ఉన్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే ద‌ర్యాప్తును  నిలిపివేయాలంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

 అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్'(ఎస్ఎఫ్జే) నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని అత్యున్నత ధర్మాసనానికి న్యాయ‌వాదుల సంఘం వివ‌రించింది. మోడీ కాన్వాయ్ను అడ్డగించింది తామేనని ఎస్ఎఫ్జే పేర్కొందని తెలిపింది. ఈ ఘటనపై ఎన్జీఓ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపొద్దని న్యాయమూర్తులనూ బెదిరించారని వివరించింది.

“‘అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు’ సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముందస్తుగా రికార్డు చేసిన బెదిరింపు కాల్స్ వచ్చాయి. జనవరి 10న ఉదయం 10.40 గంటలకు, మధ్యాహ్నం 12.36 గంటలకు ఈ కాల్స్ చేశారు. హుస్సానిన్వాలా ఫ్లైఓవర్పై మోడీ కాన్వాయ్ను అడ్డుకోవడం వెనక తమ హస్తం ఉందని పేర్కొన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని, వేల మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని అన్నారు. అలాంటి న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టొద్దని ఫోన్కాల్లో హెచ్చరించారు.“ అని న్యాయ‌వాద సంఘాలు తాజాగా వెల్ల‌డించాయి.

ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. అడ్వకేట్ల గోప్యతకు భంగం కలిగిస్తూ మొబైల్ నంబర్లను ప్రజాబాహుళ్యంలో ఉంచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు కేసు వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని అడ్వకేట్లు తమ ఫోన్లలో నిక్షిప్తం చేస్తారని, హ్యాకింగ్ జరిగితే ఇవన్నీ దుర్వినియోగమవుతాయని పేర్కొంది.

పంజాబ్ ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందే పంజాబ్‌ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చారని ధర్మాసనానికి ఏజీ తెలియజేశారు. ఏజీ వాదనలపై సీజేఐ స్పందిస్తూ.. దోషులుగా చిత్రించి చర్యలు తీసుకుంటూ.. షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన తర్వాత తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రధాని భద్రతకు సంబంధించిన విషయంపై ఎస్‌పీజీ చట్టం ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందంటూ సొలిసిటర్‌ జనరల్‌ సమాధానం ఇచ్చారు.  మొత్తానికి మోడీ పంజాబ్ టూర్ ఇష్యూ  అనేక మ‌లుపులు తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.