ఉద్యోగుల‌పై జ‌గ‌న్ వ‌రాలు..

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చలు, కసరత్తు తరువాత.. పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23.29 శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది. ఉద్యోగుల విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెండింగ్‌ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు వెల్లడించింది. 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలు(క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన ఉద్యోగుల కుటుంబాల‌కు) చేపట్టనున్నట్లు తెలిపింది.

మంచి చేయాలనే తపనతోనే ప్రతి అడుగూ వేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. కొవిడ్‌, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆదాయం తగ్గిందన్న ఆయన.. అన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫిట్‌మెంట్‌ 14.29 శాతం కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పిందని చెప్పారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సజావుగా సాగాలంటే ఉద్యోగుల పాత్ర ఉందని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపడుతామని.. చెప్పారు. ఈ ఏడాది జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేస్తామన్నారు.

“ఫిట్‌మెంట్‌ 14.29 శాతం కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పింది. ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి సజావుగా సాగాలంటే ఉద్యోగుల పాత్ర ఉంది. కొవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపడుతాం. కారుణ్య నియామకాలకు కట్టుబడి ఉన్నాం.. జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగులకు 2 వారాల్లోనే హెల్త్‌ కార్డుల సమస్యకు పరిష్కారం ఉంటుంది. సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే 10 శాతం ప్లాట్లను రిజర్వ్‌ చేస్తుంది. జ‌గ‌న‌న్న టౌన్ షిప్‌ల‌లో ఇంటి స్థలం లేని ఉద్యోగులకు కేటాయింపు ఉంటుంది“ అని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్‌ 30లోపు ప్రొబేషనరీ, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో 10శాతం ఉద్యోగులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్నీ డీఏలు జనవరి జీతంతోనే కలిపి ఇస్తామన్నారు. మ‌రి దీనిపై ఉద్యోగ సంఘాల నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.