ప్లాన్ ప్ర‌కార‌మే పీఆర్సీని నాన్చుతున్నారా?

11వ పీఆర్సీ నివేదిక‌ను బ‌య‌ట పెట్టాల‌ని వెంట‌నే పీఆర్సీ ప్ర‌క‌ట‌న‌తో పాటు మిగ‌తా 70 డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాలు కొంత కాలం నుంచి పోరాటం చేస్తున్నాయి. మధ్య‌లో సీఎస్‌, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో పీఆర్సీపై జ‌గ‌న్ కూడా స‌మీక్ష నిర్వ‌హించినా ఇప్పటివ‌ర‌కూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. దీంతో ఉద్యోగుల ఆందోళ‌న కొన‌సాగిస్తూనే ఉన్నారు. కానీ ప్ర‌భుత్వం మాత్రం పీఆర్సీ విష‌యంలో నాన్చివేత ధోర‌ణి అవ‌లంబిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎంత కాలం వీలైతే అంత కాలం ఈ విష‌యాన్ని సాగ‌దీయాల‌ని అప్పుడు ఉద్యోగుల్లో ప్ర‌జ‌ల‌పై వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

27 కంటే మించి క‌ష్ట‌మే..
ఉద్యోగుల‌తో ప్ర‌భుత్వానికి.. ప్ర‌భుత్వంతో ఉద్యోగుల‌కు ఎప్పుడూ అవ‌స‌రం ఉంటూనే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో పీఆర్సీపై ప్ర‌భుత్వ వైఖ‌రి చూస్తుంటే ఇప్ప‌ట్లో ఒక నిర్ణ‌యం తీసుకునేలా క‌నిపించ‌డం లేదు. స‌మస్య‌ను నాన్చితే ఉద్యోగులు విసిగిపోయి దారికి వ‌స్తార‌ని ప్ర‌భుత్వం ఆలోచ‌న‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వం ఫిట్‌మెంట్‌ను 27 శాతానికి మించి ఇచ్చేది లేద‌ని చెబుతోంది. ప్ర‌భుత్వంలోని పెద్ద‌లే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పారు. ప్ర‌స్తుత రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా 27 శాతం కూడా ఎక్కువేన‌ని సీఎం జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు స‌మాచారం.

వీళ్ల డిమాండ్లు..
మ‌రోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం త‌మ‌కు 39 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అంతే కాకుండా పీఆర్సీ ప్ర‌క‌ట‌న‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, సీపీఎస్ ర‌ద్దు, హెల్త్ కార్డు త‌దిత‌ర మొత్తం 71 డిమాండ్లు ప‌రిష్కరించాల‌ని కోరుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పీఆర్సీపై సీఎం స‌మీక్ష నిర్వ‌హించ‌డంతో ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న‌లు తాత్కాలికంగా విర‌మించాయి.  కానీ ఇప్పుడు ప్ర‌భుత్వ వైఖ‌రి చూసిన త‌ర్వాత మ‌రోసారి ఉద్య‌మానికి రెడీ అవుతున్న‌ట్లే క‌నిపిస్తున్నాయి.

కావ‌ల్సింది అదే..
ఉద్యోగ సంఘాలు త‌మ డిమాండ్ల ప‌రిష్కారం కోసం మ‌రోసారి ఉద్య‌మాన్ని ఉద్ధృతం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ప్ర‌భుత్వానికి కూడా అదే కావాల‌నే టాక్ వినిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు స‌మ్మెకు వెళ్లాల‌నే ప్ర‌భుత్వం అనుకుంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ నేప‌థ్యంలో క‌రోనా థ‌ర్డ్‌వేవ్ వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఉద్యోగులు స‌మ్మె చేస్తే ప్ర‌జ‌ల నుంచి వాళ్ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వానికి అండ‌గా ఉండాల్సిన స‌మ‌యంలో స‌మ్మెకు దిగితే వాళ్ల‌కే న‌ష్ట‌మ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఓ ప్లాన్ ప్ర‌కారమే దీన్ని జాప్యం చేస్తున్నార‌ని స‌మాచారం.