రాజుగారి లాయర్లు ఫుల్ హ్యాపీ

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం భలే విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు విషయంలో తొందరలోనే సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికి ఇదే విషయమై సీబీఐ ప్రత్యేక కోర్టులో వేసిన పిటీషన్ను కొట్టేశారు. అక్కడ నుండి హైకోర్టులో కేసు వేశారు. ఇక్కడ విచారణ అయిపోయి తీర్పును రిజర్వులో ఉంచారు. అయితే చివరి రోజు విచారణలో న్యాయమూర్తి చాలా తీవ్రంగానే స్పందించారు. రాజు లాయర్ కు సాక్ష్యాలు ఏవంటూ ప్రశ్నించారు.

జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేసిన పిటీషనర్ అందుకు అవసరమైన సాక్ష్యాలను ఎందుకు ప్రజెంట్ చేయలేదని నిలదీశారు. సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసిన పిటీషన్ను మళ్ళీ హైకోర్టులో యథాతథంగా ఎందుకు వేశారని ప్రశ్నించారు. సాక్ష్యులను జగన్ బెదిరిస్తున్నట్లు, ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు చూపసకుండానే బెయిల్ రద్దు చేయమనటం ఏమిటంటు ఆక్షేపించారు. జగన్ తో వ్యక్తిగత వైరాన్ని తీర్చుకునేందుకు హైకోర్టును ఎంపీ వేదికగా చేసుకుంటారా అంటు జడ్జి తీవ్రంగా మండిపోయారు. 

అంటే న్యాయమూర్తి వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలను చూసిన తర్వాత రాజు కేసును తొందరలోనే కొట్టేయబోతున్నారనే అందరూ అనుకుంటున్నారు. బహుశా తన కేసును హైకోర్టు డిస్మిస్ చేస్తుందని ఎంపీకి కూడా అనిపించినట్లుంది. అందుకనే జగన్ బెయిల్ రద్దు కేసును తొందరలోనే సుప్రీంకోర్టులో వేయబోతున్నట్లు చెప్పారు.  సాక్ష్యాలు లేకుండా కేసులు వేస్తే నిలవ్వని ఎంపీకి తెలీదా ? తెలుసు బాగా తెలుసు. అయితే జగన్ వ్యవహారం కోర్టుల్లో నాన్చటమే, లైవ్ లో ఉంచటమే రాజు ముఖ్య ఉద్దేశ్యం ఏమో.. లేదా సుప్రీంకోర్టులో ఏమైనా సాక్ష్యాలతో కేసు వేస్తారా అన్నది చూడాలి. మొత్తానికి జగన్ అంటే అభిమానం అంటూ తగ్గేదేలే అంటూ బెయిల్ రద్దు కోసం పోరాడుతున్నారు రఘురామరాజు.

అందుకనే ముందు సీబీఐ ప్రత్యేక కోర్టు తర్వాత హైకోర్టు తొందరలోనే సుప్రింకోర్టులో కేసును వేయబోతున్నది.  ఏదేమైనా ఎంపీ వేస్తున్న కేసుల వల్ల కేసులు వాదించే లాయర్లకు మాత్రం పండగే. ఎందుకంటే డబ్బులు తీసుకోకుండా ఏ లాయరు కేసు వాదించరు కాబట్టి. అందులోను ఓడిపోతామని తెలిసీ పిటీషనర్ కేసులు వేస్తున్నారంటే ఎంపీ తరపున వాదించే లాయర్లకు కూడా హ్యాపీయే కదా. మరి సుప్రింకోర్టులో కూడా కేసు కొట్టేస్తే రాజుగారు అప్పుడు ఏమి చేస్తారో చూడాలి.