రాధా నామాట విను.. చంద్ర‌బాబు స‌ల‌హా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సాధార‌ణంగా.. ఉద‌యం 8 గంట‌ల త‌ర్వాత కానీ.. ఏ ప‌నినీ మొద‌లు పెట్ట‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి.. కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. అదే అధికారంలో ఉండి ఉంటే.. ఆ లెక్క వేరు. ఉద‌యం 6 గంట‌లకే ప‌నులు ప్రారంభించేవారు. అయితే.. ఆయన బుధ‌వారం అనూహ్యంగా ఉద‌యం 6 గంట‌ల‌కే లైన్‌లోకి వ‌చ్చేశారు. తెల‌తెల వారుతూనే ఆయ‌న చ‌ర్య‌లు ప్రారంభించారు. ఒక‌వైపు పార్టీ కీల‌క నాయ‌కుడు, కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన రంగా త‌న‌యుడు వంగ‌వీటి రాధాకు చంద్ర‌బాబు ఫోన్ చేశారు. దాదాపు 20 నిముషాల పాటు ఆయ‌న రాధాతో మాట్లాడారు.

అనంత‌రం.. రాష్ట్ర డీజీపి గౌతం స‌వాంగ్‌కు కూడా లేఖ‌ను సంధించారు. ఉద‌యం 7 గంట‌ల‌కే ఆయ‌న డీజీపీని ఉద్దేశించి లేఖ రాశారు. వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి  చంద్రబాబు విజ్ఞ‌ప్తి చేశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరం గా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.

ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. హింసాత్మక సంఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయని వాపోయారు. నేరస్థులపై సమగ్ర విచారణ తర్వాత కఠినమైన చర్యలు మాత్రమే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడతాయని స్పష్టం చేశారు. డీజీపీ ఇప్ప‌టికైనా స్పందించి.. అస‌లు ఏం జ‌రిగిందో.. నేర‌స్తులు ఎవ‌రో వెంట‌నే గుర్తించి ప‌ట్టుకోవాల‌ని.. కోరారు. రాధా విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు.

ఇక‌, రాధాతో ఫోన్ లో మాట్లాడిన చంద్ర‌బాబు.. రాధా హ‌త్య‌కు రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు. ప్ర‌భుత్వం 2+2 భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. గన్‌మెన్లను తిరస్కరించడం సరికాదని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని హెచ్చరించారు. రాధాకు టీడీపీ పూర్తి అండగా నిలుస్తుందని చంద్రబాబు వివరించారు. అలాగే కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని సూచించారు. ప్ర‌భుత్వం ఇచ్చిన భ‌ద్ర‌త‌ను తీసుకోవాల‌ని సూచించారు. మ‌రి రాధా ఏం చేస్తారో చూడాలి.